సంగారెడ్డి, ఫిబ్రవరి 12: దేశంలో రామేశ్వరం, కంచిలో ఉన్న సైకత శివలింగాన్ని భక్తులు దర్శించుకునే అవకాశం లేదు. కానీ, మహాశివరాత్రికి సైకత లింగాన్ని ఇక్కడే దర్శించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వరశర్మ సిద్ధ్దాంతి తెలిపారు. ఆదివారం సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న సైకత లింగాన్ని మాధవానంద సరస్వతీ స్వామి, విద్యాశంకర్ భారతి స్వామి కూట్లే, వల్లభానంద స్వామి సరస్వతి చేతులమీదుగా ప్రతిష్టించనున్నామన్నారు.
ఈ నెల 16, 17న 36 అర్చనలు నీలకంఠేశ్వర ఆరాధన, మృత్యుంజయ ఆరాధనలతో ఆటు విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నెల 18న మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సందర్శనకు ఏర్పాటు చేసిన లింగాన్ని ప్రతి భక్తుడు అభిషేకం చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ లింగం 320 టన్నుల ఇసుక, 19.5 అడుగుల ఎత్తులో, 233 అంగుళాలతో తయారు చేసిన లింగాన్ని భక్తులు అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 19 ఏండ్లుగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సామాజిక, ఆధ్యాత్మిక సేవలు చేస్తుందన్నారు. సమావేశంలో ప్రశాంత్, కృష్ణమూర్తి, కాశీనాథ్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను మహేశ్వరశర్మ సిద్ధాంతి ఆవిష్కరించారు.