ప్రజావైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్, దవాఖానలు మరింత బలోపేతం చేసే దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్కారు దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవలు మరింత పారదర్శంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రూ.కోట్లతో అత్యాధునిక పరికరాలు, వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నది. అయినప్పటికీ చాలాచోట్ల డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, ఇష్టారీతిన డుమ్మాలు కొట్టడం, వ్యక్తిగత పనుల కోసం విధుల మధ్యలోనే వెళ్లిపోతుండడంతో ప్రజలు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సర్కారు నడుం బిగించింది. ప్రతి పీహెచ్సీలో మూడు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని డీఎంహెచ్వో, కలెక్టరేట్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాలకు అనుసంధానం చేసింది. ఇప్పటికే మెదక్ జిల్లాలో 18, సంగారెడ్డి జిల్లాలో 35 దవాఖానల్లో కెమెరాలు బిగించగా, ఏ దవాఖానలో ఏం జరుగుతున్నది? ఏ సిబ్బంది ఏం చేస్తున్నారు? వైద్య పరీక్షలు చేస్తున్నారా? లేదా? అనే విషయాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మెదక్, (నమస్తే తెలంగాణ) నవంబర్ 29 : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు పీహెచ్సీల్లో వైద్యులు సమయానికి రాకపోవడంతో పాటు మధ్యా హ్నం నుంచే ఇంటిముఖం పడుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారనే విమర్శలు రావడంతో డుమ్మా కొట్టే వైద్యులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈఐఎల్ కంపెనీ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆ రోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వీటిని ప్రారంభించారు.
మెదక్ జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో..
జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు సీహెచ్సీలు, ఒక ఏరియా దవాఖా న, ఒక జిల్లా కేంద్ర దవాఖానలు ఉన్నా యి. ప్రతి రోజు ఉదయం 9నుంచి సా యంత్రం 4గంటల వరకు రోగులకు వైద్య సేవలు అందించాల్సి ఉం టుంది. కానీ చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో దవా ఖానకు వచ్చిన రోగులకు అవస్థలు తప్పడం లేదు. దీంతో వైద్యులు సమయానికి వచ్చేలా రోగులకు వైద్యసేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పీహెచ్సీల్లో 3 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. మెడికల్ ఆఫీసర్ గదిలో ఒకటి, ల్యాబ్లో ఒకటి, ఫార్మసీలో మరొకటి బిగించారు. వీటిని డీఎంహెచ్వో, కలెక్టరేట్ కార్యాలయం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయా లకు అనుసంధానం చేశారు.
డుమ్మా వైద్యులకు చెక్
జిల్లాలోని పీహెచ్సీల్లో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలతో డుమ్మా వైద్యులకు చెక్ పడనుంది. ఇప్పటి వరకు వైద్యులు దవాఖానకు వచ్చి తూతూ మంత్రంగా వైద్య సేవలు అందించేవారు. దవాఖానకు ఎంతమంది రోగులు వస్తున్నారనే సమాచారం కూడా ఉండేది కాదు. అంతేకాకుండా పీహెచ్సీల్లో ఇద్ద రు వైద్యులున్న చోట ఒకరికొకరు పరస్పర అవగాహనతో వారానికి మూడు రోజులే హాజరవుతారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేటు దవా ఖానలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఇక ఆ పరిస్థితి మారనున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎంత మంది వస్తున్నారు.. వారి కి వైద్యులు పరీక్షలు చేస్తున్నా రా.. లేదా మందులు పంపిణీ చేస్తున్నారా లేదా అనే విషయం ఎప్పటికప్పుడు తెలియనుంది. అంతేకాకుండా సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందితో జిల్లా వైద్యాధికారి, ఉన్నతాధికారులు నేరుగా మాట్లాడే అవకాశం ఉంది.
పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు
సంగారెడ్డి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. జిల్లా కేంద్ర దవాఖానతోపాటు పీహెచ్సీల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు మందులు అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానలకు, పీహెచ్సీలకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ దవాఖా నలకు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందుతున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ హబ్ను ఏర్పాటు చేసిం ది. హైదరాబాద్లోని మానిటరింగ్ హబ్ నుంచి రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలను నేరుగా వీక్షించటంతో పాటు వైద్య సేవలను పర్యవేక్షింవచ్చు. మానిటరింగ్ హాబ్ నుంచి పీహెచ్సీలను వీక్షించేందుకు వీలుగా జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, అర్బన్హెల్త్ సెంటర్లలో ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేశారు. పీహెచ్సీల్లో బిగించిన కెమెరాలు చిత్రీకరించే దృశ్యాలను మానిటరింగ్ హబ్లో నేరుగా వీక్షించవచ్చు.
మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), అర్బన్ హెల్త్ సెంటర్లలో మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చూస్తోంది. పీహెచ్సీల్లో వైద్యలను నియామకాలు చేపట్టడంతో పాటు అవసరమైన చోట ఔట్సోర్సింగ్ ద్వారా వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టడం జరుగుతుంది. పీహెచ్సీల్లో రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతున్నారు. పీహెచ్సీ ల్లో కెమెరాలను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని 31 పీహెచ్సీలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లలో త్రీడీ సీసీ కెమెరాలను బిగించటంతో పాటు నెట్వర్క్ రికార్డింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మనూరు, భానూరు, ఝరాసంగం పీహెచ్సీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రతి పీహెచ్సీల్లో ఔట్పేషెంట్స్ను పరీక్షించే గది, ఫార్మసీ గది, ల్యాబ్లో త్రీడీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. త్రీడీ సీసీ కెమెరాల ఏర్పాటుతో పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో డాక్ట ర్లు, వైద్య సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. త్రీడీ సీసీ కెమెరాలో 24 గంట లు పనిచేస్తూ ప్రతీది రికార్డు అవుతున్నది. ఇలా రికార్డు అవుతున్న దృశ్యాలు రాష్ట్రస్థాయి మానిటరింగ్ హబ్లో నేరుగా వీక్షించేలా ఆన్లైన్లో అనుసంధానం చేశారు. దీంతో పీహెచ్సీ, సీహెచ్సీల్లో ఏమైనా సమస్యలు తలెత్తినా, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
పర్యవేక్షణ పెరుగుతున్నది..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నది. పీహెచ్సీ, అర్బ న్ హెల్త్ సెంటర్లలో సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో మానిటరింగ్ హబ్ ఏర్పాటు చేశా రు. ఇందులో భాగంగానే పీహెచ్సీ, అర్బ న్ హెల్త్సెంటర్లలో త్రీడీ సీసీ కెమెరాలు, నెట్వర్క్ వీడియో రికార్డుయంత్రాల ఏర్పాటు చేశాము. జిల్లాలోని 28 పీహెచ్సీలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లలో కెమెరాల ఏర్పాటు పూర్తి అయ్యింది. మిగతా మూడు పీహెచ్సీల్లో త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. సీసీ కెమెరాల ఏర్పాటుతో డాక్టర్లు, వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావటంతో పాటు సమయపాలన పాటిస్తారు. తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి.
– డాక్టర్ గాయత్రీ, సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి
ప్రభుత్వం నిర్ణయం మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు
రోగులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. జిల్లాలోని 18పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు బిగించాము. ప్రతి పీహెచ్సీలో మూడు కెమెరాలను ఏర్పా టు చేశాం. వీటిని డీఎంహెచ్వో కార్యాలయంతో పాటు కలెక్టరేట్, డీఎంఈకి అనుసంధానం చేశాము. నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ విజయనిర్మల, మెదక్ డీఎంహెచ్వో