గజ్వేల్, ఆగస్టు 11 : ఆయిల్పామ్ తోటలో అంతర పంటను సాగు చేయడం ద్వారా రైతులు డబుల్ ఆదాయం పొందవచ్చని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మండలంలోని అక్కారం సమీపంలోని రైతు లక్ష్మణ్ పదెకరాల్లో సాగుచేసిన ఆయిల్పామ్ తోటను పరిశీలించి, అంతరపంటగా అరటి సాగువిధానాన్ని రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 10వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతుందని, ఈ యేడు మరో 10వేల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలను సాగుచేసే విధంగా రైతులకు అవగాహన కల్పించేలా అధికారులను ఆదేశించామన్నారు. ఆయిల్పామ్ మొక్కలు డ్రిప్, ఎరువులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. నంగునూరు మండలంలోని దర్గపల్లిలో కోతులు వరి నారును కూడా పీకేస్తు నష్టపరుస్తున్నాయని రైతులు ఆందోళన చేశారని, కానీ, ఆయిల్పామ్ తోటలోకి కోతులు, పందులతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. లక్ష్మణ్ ఆయిల్పామ్ తోట లో ఎక్స్ఫ్లోజర్ విజిట్ నిర్వహించి, ఆయిల్పామ్ సాగుతో కలిగే లాభాల గురించి రైతులకు వివరించాలన్నారు. ఐదెకరాలకు ఎక్కువగా భూమి ఉన్న రైతులతో తోటలను పెట్టించాలని కలెక్టర్, వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు లక్ష్మణ్ దంపతులను మంత్రి సన్మానించారు. మంత్రి వెంట కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి ఉన్నారు.