హుస్నాబాద్, జనవరి 17: హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న గ్రంథాలయ భవనం పనులు మార్చిలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ ఆదేశించారు. హుస్నాబాద్లోని ఎంపీడీవో కాంప్లెక్స్ ఆవరణలో రూ.50లక్షలతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం గ్రంథాలయం ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్నందున నిరుద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, త్వరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా నుంచే నిధులు సమకూర్చే అవకాశం ఉన్నందున పనులను వేగవంతం చేయాలని, ఎప్పటికప్పుడు బిల్లులు వచ్చేలా చూస్తామని గుత్తేదారుకు హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక గ్రంథపాలకుడితో మాట్లాడి నిత్యం గ్రంథాలయానికి ఎంత మంది వస్తారు, వారికి కావాల్సిన సౌకర్యాలేమిటనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త గ్రంథాలయంలో సకల సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ డీఈఈ మధుసూదన్, లైబ్రేరియన్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.