రైలు బండి రైలు బండి నడకలోని నాట్యం ఉంది.. నాట్యంలోని గెంతులన్నీ చికుబుకు.. చికుబుకు అని ఓ సినీ గేయ రచయిత పాటలో రాసిన విధంగా ఎంతో అందంగా ఉన్నది ఆ పాఠశాల. అది చూస్తే ఇది నిజంగా టైనేనా.. లేదా పాఠశాలనా..? అనుకుంటారు అందరూ. అవునూ ఇది నిజం. సర్కారు బడి అంటే 6 నుంచి 10 గదులు, ప్రార్థన చేసే ముందు ప్రదేశంలో ఓ స్టేజీ, నాలుగు చెట్లు ఉంటాయనుకుంటే పొరపాటే.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆ ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయులు ఓ దాత సహకారంతో ఎంతో చక్కగా తీర్చిదిద్దుకున్నారు. ట్రైన్ స్కూల్ ఏంటి..? అది ఎక్కడ ఉంది. అనే విషయం పై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
చేర్యాల, డిసెంబర్ 7 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు (ఇంగ్లిష్ మీడియం) ఉన్నది. 2018 సంవత్సరం వరకు అన్ని పాఠశాలలు మాదిరిగానే కొనసాగుతూ వచ్చింది. ఇంతలో ఆ పాఠశాలకు హెడ్మాస్టర్ ఎ.సుధాకర్ బదిలీపై వచ్చాడు. అంతకుముందు అత్యధిక విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలో విధులు నిర్వహించిన హెచ్ఎం ఈ పాఠశాలలో అడ్మిషన్లు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో తోటి ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాడు. పాఠశాల రూపురేఖలను మారిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, తన వద్ద ఓ ఆలోచన ఉన్నదని, ట్రైన్ తరహాలో పాఠశాల, తరగతి గదులు ఉండే విధంగా మంచి డిజైన్లతో రంగులు వేయిద్దామని ఉపాధ్యాయులకు సూచించారు. దీనికి ఉపాధ్యాయులు సరే అనడంతో వెంటనే నరేందర్ అనే ఉపాధ్యాయుడు తన స్నేహితుడు ఎన్ఆర్ఐ వల్లప్రగడ వెంకట వివేకానంద ద్వారా ఆర్థికసాయం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆ ఉపాధ్యాయుడు తన స్నేహితుడి (ఎన్ఆర్ఐ)తో ఫోన్లో విషయాన్ని తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి రూ.41వేలు విరాళంగా అందజేశాడు. దీంతో చకచకా పనులు ప్రారంభించారు. పాఠశాలను కార్పొరేట్ లుక్ వచ్చే విధంగా రూపురేఖలనే మార్చివేశారు.
ఆకట్టుకుంటున్న పాఠశాల..
పాఠశాలకు వచ్చామా.. పాఠాలు చెప్పామా.. వెళ్లిపోయామా అనే విధంగా కాకుండా ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలకు రైలుబోగీల ఆకారాల్లో రంగులు వేయించడంతో స్కూల్ వాతావరణం మారిపోయింది. స్కూల్, గదులకు ప్రత్యేకమైన డిజైనర్లతో రంగులు వేయించడంతో విద్యార్థులతో పాటు అందరినీ ఇటే ఆకట్టుకుంటున్నది. దీంతో పాఠశాలకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 60మంది విద్యార్థులు కలిగి ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 163 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సైతం ఇంగ్లిష్ విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి స్కూల్ వాతావరణం మార్చడంతో గ్రామం నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. కానీ, పాఠశాలలో నీటి వసతి, టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు, లేదా దాతలు ముందుకు వస్తే విద్యార్థులకు మరిన్ని వసతులు చేకూరుతాయి.
విద్యార్థుల సంఖ్య పెరిగింది..
2018వ సంవత్సరంలో నేను బదిలీ పై చుంచనకోట గ్రామ ప్రాథమిక పాఠశాలకు వచ్చాను. అప్పుడు విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ఎట్టి పరిస్థిలుల్లోనైనా విద్యార్థుల సంఖ్య మరింతగా పెంచాలని నిర్ణయించుకున్న. తోటి ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలకు రైలును పోలిన రంగులు వేయించడంతో పాఠశాల రూపురేఖలే మారిపోయి. ఆ రంగులు విద్యార్థులను ఆకర్షించడంతో మొదటి సంవత్సరం 60 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య 103 చేరింది. ప్రస్తుతం 163 మంది విద్యార్థులు పాఠశాలలో విద్యను అభ్యసిస్తునన్నారు. భవిష్యత్లో అడ్మిషన్లు ఇంకా పెరుగనున్నాయి.
ఎ.సుధాకర్, హెఎం ప్రాథమిక పాఠశాల, చుంచనకోట