రామాయంపేట, జనవరి 17 : మెదక్ జిల్లావ్యాప్తంగా పాన్ బ్రోకర్లు వేధింపులకు గురిచేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి అన్నారు. మంగళవారం రామాయంపేటకు విచ్చేసిన ఎస్పీ పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2021-22 ఏడాదిలో నేరాల సంఖ్య తగ్గించామన్నారు. ప్రజ లు పోలీసులకు సహకరించాలని సూచించారు.
వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి వాహనానికి కాగితాలు తప్పకుండా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా పాన్ బ్రోకర్లు దాడులు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో పాన్ బ్రోకర్లు దాడులు చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తామన్నారు.
త్వరలో జిల్లా లో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపూర్ జరిగిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని, విచారణ పూర్తి కాగానే వివరాలు మీడియాకు తెలుపుతామన్నారు. ఇన్నోవా వాహనం దగ్ధం, డ్రైవర్ మృతిపైవిచారణ చేపడుతున్నామని ఎస్పీ విలేకరులతో తెలిపారు. విలేకరుల సమావేశంలో రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రంజిత్ ఉన్నారు.