రామాయంపేట రూరల్, మే 03: రామాయంపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Indlu) 363 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో దామరచెరువు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామంలో 97 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇప్పటి వరకు కేవలం ఆరుగురు మాత్రమే బేస్మెంట్ వరకు నిర్మించారు. మిగత వారు ఇండ్లు నిర్మించడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి నమూన నచ్చక, మరికొందరు విడతల వారీగా బిల్లులు ఇస్తారని కట్టడానికి ముందుకు రావడం లేదు. ఒకేసారి ఇచ్చినా, ప్రభుత్వమే కట్టిస్తే బాగుండేదని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు దామరచెరువు మినహ ఎక్కడ కూడా పనులు ప్రారంభం కాలేకపోవడం గమనార్హం.
కట్టడానికి సిద్ధంగా ఉన్నా మంజూరు అయితలే..
ఇండ్లు లేని వారికి ఇస్తామని సర్కారు చెప్పగానే ధరఖాస్తు చేశానని, ఇప్పుడు ఇండ్లు కడుతున్న వారితో తన పేరు పంపారు కానీ మంజూరు రాలేదని పసులక్ష్మి అనే మహిళ తెలిపారు. రెండో విడతలో చూద్దామని చెప్తున్నారని, కొందరికి ఇచ్చి అర్హత ఉన్న మాలాంటి వాళ్లకు ఇవ్వకపోవడం భాదగా ఉందని చెప్పారు.
పూరి గుడిసెలో బతుకుతున్నాం..పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి..
ఇల్లు కట్టుకునే స్థోమత లేకనే పూర్తి గుడిసెల్లో ఏండ్ల నుంచి ఉంటున్నామని గంగారపు పోచవ్వ అనే మహిళ చెప్పారు. లబ్దిదారుల జాబితాలో నా పేరు వచ్చింది. కానీ చిల్లి గవ్వలేక కట్టుకోలేకపోతున్నాం. ప్రభుత్వం కట్టిస్తే ఇల్లు కట్టే పరిస్థితి ఉంది. ఇల్లు కట్టడానికి అప్పు అడిగితే చిల్లిగవ్వ పుట్టడం లేదని వాపోయారు.
లబ్దిదారులకు ముందే డబ్బులిస్తే బాగుండేది..
ఇండ్ల ఎంపికలో ఎక్కువ మంది చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని సంపత్కుమార్ చెప్పారు. ప్రభుత్వం ముందుగా డబ్బులు ఇస్తే ఎంతో ఆసరాగా ఉండేదన్నారు. అప్పులు తెచ్చి కట్టాల్సి వస్తుందని, దీంతో పనుల్లో సమయం వృధా అవుతుందని తెలిపారు. సర్కారు కట్టించినా బాగుండేదని వెల్లడించారు.
నిలువు నీడ లేదు..నేను ఒక్కడినే..
మొదట్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే నా లాంటి వాళ్లకు ఇస్తారని ఎంతో ఆశపడ్డామని శంకరయ్య అనే వ్యక్తి అన్నారు. రోజు కూలీ పనులు చేస్తూ పూరి గుడిసెలో ఉంటున్నానని, తనకు భార్య, పిల్లలు లేరని చెప్పారు. సర్కారు గుర్తించి నాలాంటి వాళ్లకు ఇల్లు కట్టిస్తే ఎంతో ఆసరాగా ఉండేదన్నారు.