మనోహరాబాద్ : కొవిడ్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని డీఈవో రమేశ్కుమార్ అన్నారు. శివ్వంపేట మండలం దొంతి, శివ్వంపేట, శభాష్పల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గూడూరు కస్తూర్బాగాంధీ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, రికార్డులను పరిశీలించారు. పాఠశాలలకు వచ్చే ప్రతి విద్యార్థినీ థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షించిన తర్వాతే తరగతి గదుల్లోకి అనుమతించాలని టీచర్లకు సూచించారు. విద్యార్థులు మాస్కులు, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యాబోధన ప్రారంభించామని, హాజరుశాతం 42 శాతం వరకు నమోదు అయ్యిందన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బుచ్చానాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.