పేదల సొంతింటి కలను టీఆర్ఎస్ సర్కారు నెరవేరుస్తున్నది. దశలవారీగా నిర్మాణాలు పూర్తి చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సంగారెడ్డి జిల్లా కేంద్ర శివారులో 329, కంది వద్ద నిర్మించిన 96 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నేడు ప్రారంభించనున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతుండగా, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అర్హులైన వారికే ఇండ్లు కేటాయించామని, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి రూ.3లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కంది, నవంబర్ 29: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి శివారులో, మండల కేంద్రమైన కంది శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9గంటలకు కంది, 10గంటలకు సంగారెడ్డిలో ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ గృహప్రవేశాల కార్యక్రమాలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పరిశీలించారు.
కందిలో నిర్మించిన నాలుగు బ్లాక్లలో విద్యుత్ కనెక్షన్, నీటి సరఫరా, డ్రైనేజ్ తదితర పనులన్నీ పూర్తయ్యాయ లేదా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ పేదల సొంతింటి కల సాకారం చేస్తుందన్నారు. అర్హులైన వారికే డబుల్ బెడ్రూంలను కేటాయించామని, సొంత స్థలం ఉన్న పేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కంది మండల పరిధిలో నిర్మించిన 96 ఇండ్లను ఉత్తర్పల్లి, కంది, కాశీపూర్, ఎర్ధనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కేటాయించగా, సంగారెడ్డిలో 329 డబుల్ ఇండ్ల పంపిణీ ఉన్నట్లు పేర్కొన్నారు.
అంతకుముందు సంగారెడ్డి శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను చింతా ప్రభాకర్ పరిశీలించి, కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయనవెంట డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, కంది సర్పంచ్ విమల వీరేశం, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మహేందర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, జంగయ్య, ఆనంద్రావు, బొంగుల రవి, మోహన్ నాయక్, కంది తహసీల్దార్ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి విద్యాధర్గౌడ్, ఆర్ఐ మల్లికార్జున్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.