మెదక్, డిసెంబర్ 7 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హక్కీంపేట శివారులో జమున హేచరీస్ 70.33 ఎకరాలు అసైన్డ్ సీలింగ్ భూములను ఆక్రమించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నా మని ప్రజలకు తెలియజేసే క్రమంలో మెదక్ కలెక్టర్ హరీశ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వివరాలు వెల్లడించగా.. కలెక్టర్పై ఒక మహిళ అనుచితంగా మాట్లాడినట్లు మంగళవారం దినపత్రికల్లో వచ్చిన వార్తకు జిల్లా అధికారుల సంఘం స్పందిస్తూ మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ… కలెక్టర్ టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారని, గులాబీ కండువా కప్పుకోవాలని అభ్యంతకర ప్రకటన ఇవ్వడం బాధకలిగించందని, మెదక్ జిల్లా అధికారుల సంఘం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఆ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. జిల్లా అధికారులందరూ ప్రభుత్వ ఆదేశాలు, నియమ నింబంధనల మేరకే పనిచేస్తారన్నారు. కానీ, రాజకీయ దురుద్దేశంతో కలెక్టర్, ఉద్యోగస్తులు, జిల్లా అధికారులను ఓ పార్టీకి ఆపాదించడడం భావ్యం కాదన్నారు. దీనిని జిల్లా అధికారులు సంఘం దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.
అనంతరం జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కలెక్టర్ హరీశ్ కష్టపడుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాంటి అధికారులపై అనుచితంగా మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కలెక్టర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధ కలిగించినట్లు తెలిపారు. ఈటల జమున వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నియమ నిబంధనల మేరకు జిల్లా అధికారులు, కలెక్టర్ పూర్తి నిబద్ధ్దతతో పనిచేస్తున్నారన్నారు. 2019 సంవత్సరంలో జమున హేచరీస్ వాళ్లు అనుమతులు తీసుకున్నారని, ఆ రోజు ఎవరైతే అనుమతులు ఇచ్చారో వారంత గులాబీ కండువా కప్పుకొని ఇచ్చారా, ఆ విషయాన్ని ఒకసారి గుర్తుకు చేసుకొని మాట్లాడాలని హితవు పలికారు. అధికారులను కించపరిచే విధంగా మాట్లాడడం సరైన సంప్రదాయం కాదన్నారు. సమావేశంలో డీఈవో రమేశ్కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి జగదీశ్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా అధికారులు జయరాంనాయక్, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.