జహీరాబాద్, డిసెంబర్ 7: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆకతాయిల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. అర్ధరాత్రి అయ్యిదంటే పట్టణంలో ప్రయాణించాంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పట్టణంలోని శాంతినగర్, రాంనగర్, హమాలీ కాలనీతో పాటు పలు కాలనీల్లో యువకులు మద్యం తాగి రోడ్లపై వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బ్లాక్ రోడ్డులో జరిగిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్లోని శాంతినగర్కు చెందిన భార్యాభర్తలు అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు దిగి బ్లాక్ రోడ్డు నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. శాంతినగర్కు చెందిన ఇద్దరు యువకులు ఆ దంపతులపై దాడి చేసి, సదరు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం దంపతులు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారించి దంపతులపై దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేశారు.
ఆకతాయిలు బరితెగించి అర్ధరాత్రి దాడులు చేయడం, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. ఆకతాయిలపై చర్యలు తీసుకోకుం డా కొందరు రాజకీయ నాయకులు పోలీసులకు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు నిందితులను విచారించకుండానే వదిలేస్తున్నట్లు సమాచారం. తాము మద్యం తాగి అర్ధరాత్రి రోడ్లపై తిరిగినా పోలీసులు ఏమీ చేయరనే ధీమాతో ఆకతాయిలు బరితెగిస్తున్నారు. పట్టణంలో కొన్ని హోటళ్లు అర్ధరాత్రి వరకు నడిపిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని హోటళ్లలో మద్యం తాగుతున్నట్లు ఉన్నాయి.
ఆదివారం బస్సు దిగి నడుచుకుంటున్న శాంతినగర్కు వెళ్తున్న దంపతులపై కొందరు యువకులు వెంబడించి దూర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వీడియో జహీరాబాద్లో వైరలయ్యింది. ఈ వీడియో మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మహిళ ఆత్మరక్షణ కోసం ఫోన్ చేస్తుండగా ఫోన్ తీసుకుని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనను ఇతర భవనంపై ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. భార్యాభర్తలపై దాడి చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు బుధవారం పట్టణ ఎస్సై శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. పట్ణణంలోని శాంతినగర్కు చెందిన మహ్మద్ సూఫియాన్, నాల్సబ్ మోహల్లాకు చెందిన మహమ్మద్ సమీర్ను అరెస్టు చేశామన్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని జహీరాబాద్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి విచారించి ఇద్దరిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపించినట్లు తెలిపారు.