యాసంగిలో జహీరాబాద్ ప్రాంత అన్నదాతలు ఆరుతడి, వాణిజ్య పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. వానకాలంలో పుష్కలంగా వానలు కురవడం, వ్యవసాయ బావుల్లో నీరు ఉండడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు ఆరుతడి పంటలపై ఆసక్తి చూపుతున్నారు. యాసంగిలో పంట మార్పిడి కోసం భూములు సిద్ధం చేసిన రైతులు మార్కెట్లో అధిక ఆదాయం వచ్చే పంటలైన శనగ, తెల్లజొన్న, మొక్కజొన్న, కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఎర్ర నేలలు వాణిజ్య పంటలకు అనుకూలం కావడంతో రైతులు సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఆధునిక పద్ధతైన బిందుసేద్యంతో పంటలు పండిస్తున్నారు. జహీరాబాద్ డివిజన్లోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో రైతులు ఈ యాసంగిలో తెల్లజొన్న, శనగ పంట అధికంగా సాగుచేస్తున్నారు. జహీరాబాద్, కోహీర్ మండలాల్లో కర్షకులు అధికంగా కూరగాయ పంటలు సాగుచేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు.
జహీరాబాద్, డిసెంబర్ 20: యాసంగిలో అన్నదాతలు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వానకాలనంలో పుష్కలంగా వానలు కురవడంతో వ్యవసాయ బావుల్లో నీరు ఉండడంతో ఆరుతడి పంటలు జోరుగా సాగుచేస్తున్నారు. జహీరాబాద్ వ్యవసాయ శాఖ డివిజన్లో వానకాలంలో రైతులు అధికంగా పత్తి, కంది, మొక్కజొన్న, సోయా పంటలు సాగు చేశారు. రెండో పంట సాగు చేసేందుకు భూములు సిద్ధం చేసి సాగు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పడే శనగ, జొన్న పంటలు అధికంగా సాగు చేస్తున్నారు. మరికొందరు మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకులంగా ఉండడంతో రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. రైతులు యాసంగిలో పంట మార్పిడి చేసి, కొత్త పంటలు సాగు చేస్తున్నారు. ఎర్ర నేలలు వాణిజ్య, ఆకుకూరలు, కూరగాయలకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా కొత్త పద్ధతుల్లో బిందుసేద్యం ద్వారా పంటలు పండిస్తున్నారు. అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తున్నారు. వేసవిలో భారీ అమ్మకాలు జరిగే పుచ్చకాయలు సాగు చేస్తున్నారు. బొప్పాయి, ఆకుకూరలు, కూరగాయలు పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అధికంగా ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
వానకాలంలో సాగు చేసిన పత్తి పంటను తీసుకొని వ్యవసాయ బావులు వద్ద రైతులు రెండోపంటగా శనగ, తెల్లజొన్న, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తున్నారు. పత్తి పంటను అధికంగా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో సాగు చేశారు. కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లో తక్కువగా సాగు చేశారు. నవంబర్, డిసెంబర్లలో పత్తి పంట తీసుకొని భూములు దున్ని విత్తనాలు వేస్తున్నారు. న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో అధికంగా రైతులు తెల్లజొన్న, శనగ పంట అధికంగా సాగు చేస్తున్నారు.
జహీరాబాద్, కోహీర్ మండలాల్లో యాసంగిలో రైతులు ఆధికంగా ఆలుగడ్డతోపాటు కూరగాయలు సాగు చేస్తున్నారు. వానకాలంలో మినుము, సోయా, పెసర పంటలు సాగుచేసిన రైతులు చలికాలంలో ఎక్కువగా ఆలుగడ్డ సాగు చేస్తున్నారు. కొందరు రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. సీజన్లో అమ్మకాలు జరిగే కూరగాయలు సాగు చేస్తున్నారు. వంకాయ. టమాట, బెండా, కాకర, బీర, దొండ, గోరుచిక్కుడు, దోస, చిక్కుడుతోపాటు బంతిపూలు సాగు చేస్తున్నారు. పచ్చమిర్చి పంటను సాగు చేస్తున్నారు. మార్కెట్లో కూరగాయలకు మంచిధర రావడంతో రైతులు యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సంప్రదాయ సాగులో వస్తున్న నష్టాలతో విసుగు చెందిన రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. కొత్త పద్ధతిలో కూరగాయల నారుమడి పెంచి మొక్కలు నాటుతున్నారు. విత్తనం, నారుమడి తయారీ, చీడపీడల యాజమాన్యం , వ్యవసాయ కూలీల ఖర్చులు తగ్గించేందుకు కొత్త పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రైతులు నాణ్యమైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకుని సాగు చేస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు పత్తి పంట తీసుకొని కూరగాయలు సాగు చేస్తున్నారు. సరైన సస్యరక్షణ చర్యలు తీసుకొని ఆధిక దిగుబడులు సాధిస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో తెల్లజొన్నకు మంచిధర ఉండడంతో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటగా వ్యవసాయ బావుల వద్ద సాగు చేస్తున్నారు. సీజన్లో రూ. 4 నుంచి 5 వేల వరకు క్వింటాలు అమ్ముతున్నారు. 90 రోజుల్లో తెల్లజొన్న పంట చేతికి వస్తుంది. డిసెంబర్లో సాగు చేస్తే మార్చి వరకు పంట తీసుకుంటున్నారు. ఎకరానికి తెల్లజొన్న 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుం ది. దీంతో వాతావరణం అనుకులంగా ఉండడంతోపాటు పంట దిగుబడి పెరిగిపోవడంతో సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి రైతు వ్యవసాయ బావుల వద్ద తెల్లజొన్న పంట సాగు చేస్తున్నారు. తమ కుటుంబానికి కావాలసి జొన్నలు ఉంచుకొని మిగత జొన్నలను విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు.
యాసంగిలో కూరగాయల సాగుతో అధిక లాభాలు వస్తా యి. మాది ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం. జహీరాబాద్లో వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని పలు రకాల పూలు, కూరగాయలు సాగు చేస్తున్నాం. సీజన్ వారీగా కూరగాయలు, పూలు పండించి ప్రతిరోజూ రాజమహేంద్రవరానికి పంపిస్తాం. జహీరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో పంపించి అక్కడ అమ్మకాలు చేస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలు, పూలు సాగు చేస్తున్నాం. వ్యవసాయ బావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో బిందు సేద్యంలో పంటలు సాగు చేస్తున్నాం. తక్కువ నీటితో కూరగాయలు, పూలు పండిస్తున్నాం.
ఆరుతడి పంటలకు మార్కెట్లో మంచి ధర ఉండడంతో తెల్లజొన్న, శనగతోపాటు వాణిజ్య పంటలను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ బావుల వద్ద ఆరుతడి పంటగా సాగు చేస్తున్నారు. పత్తి, సోయా, మినుము, పెసర పంట తీసుకొని రెండో పంటగా శనగ, తెల్లజొన్న, ఆలుగడ్డ, కూరగాయల పంట లు పండిస్తున్నారు. మార్కెట్లో అధిక ధర ఉన్న పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.