ప్రస్తుత సమాజంలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా పేదలకు సమకూరుస్తున్నది. విద్యతోనే జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం బడుల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలను కల్పిస్తుంది. సర్కారు బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలతోపాటు నోటుబుక్కులను సైతం అందజేస్తున్నది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 2,334 పాఠశాలల్లోని 1,96,022 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నది. ఆర్థికభారం తగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 26 :ప్రతి మనిషికీ విద్య, వైద్యం ఎంతోముఖ్యం. ప్రస్తుతం విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. విద్యతోనే జీవితాలు మారుతాయని తెలంగాణ ప్రభుత్వం మె రుగైన విద్యతోపాటు పాఠశాలల్లో మౌలిక, కనీస వసతులను సమకూరుస్తూ విద్యార్థులకు అందజేస్తున్నది. ప్రభు త్వపాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాం ఇస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సన్నబియ్యంతో కడుపు నిండా భో జనం పెడుతున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 12 న పాఠశాలల పునఃప్రారంభం రోజున పాఠ్య పుస్తకాలతోపాటు నోట్బుక్స్ పంపిణీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిలాల్లో 1062 పాఠశాలలు ఉండగా.. ఇందు లో 637 ప్రాథమిక పాఠశాలలు, 183 ప్రాథమికోన్నత పాఠశాలలు, 242 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 90,022 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి అవసరమైన 6,94,448 పాఠ్యపుస్తకాలతోపాటు ఈ విద్యా సంవత్సరం ఒక్కో విద్యార్థికి సబ్జెక్టుకు ఒకటి చొప్పున నోట్బుక్స్ సైతం అందజేసింది. వీటీని బయట కొనుగోలు చేస్తే ఒక్కొక్కరికీ రూ.వెయ్యికి పైగా ఖర్చు అవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గింది.
– సంగారెడ్డి జిల్లాలో 100శాతం
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు అవసరమైన మేరకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లా లక్ష్యం మేరకు మొత్తం 7,86,990 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా, ఆ మేరకు మొత్తం పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. విద్యార్థుల అవసరాలకనుగుణంగా 6,16,243 పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 6,36,171 నోట్బుక్స్ అవసరం కాగా, ఇప్పటివరకు 1.09,400 నోట్బుక్స్ జిల్లాకు చేరుకున్నాయి. ఇందులో 95,055 నోట్బుక్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. మిగతా నోట్బుక్స్ పంపిణీ చేయాల్సి ఉన్నది. డిసెంబర్ నుంచి ప్రారంభంకానున్న రెండో విడుత పాఠ్య పుస్తకాలు రెండున్నర లక్షలు కూడా ఇప్పటికే సంగారెడ్డి జిల్లాకు చేరుకున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పాఠశాల 1, కేంద్రీయ విద్యాలయాలు 2, కేజీబీవీ 17, మదర్సా అన్రికగ్నైజ్డ్ 10, మినీ గురుకులం 1, మైనార్టీ వెల్ఫేర్ 12, మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలు 12, ఎంపీపీ, జడ్పీపీహెచ్ ఎస్లుమొత్తం 1,220, ప్రైవేట్ ఎయిడెడ్ 5, ప్రైవేట్ అన్ ఏయిడెడ్ 431, ప్రైవేట్ అన్ ఏయిడెడ్ (సీబీఎస్ఈ) 12, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ (ఐసీఎస్ఈ) 1, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 37, రాష్ట్ర ప్రభుత్వ (డీఎన్టీ) 5, టీఎస్ మోడల్ స్కూల్స్ 10, టీఎస్ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు 11, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ 6, టీఎస్ఆర్ఈఐ సొసైటీ స్కూల్స్ 2, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు 4, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ను ఉచితంగా పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ ఇప్పటికే విద్య, క్రీడలకు నిధులు కేటాయించి వి ద్యార్థుల ఉన్నతికి తోడ్పాటునందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చది వే విద్యార్థులకు యూనిఫాం, పా ఠ్యపుస్తకాలు అందిస్తున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి నోట్బుక్స్ ఇవ్వడం మంచి నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యావకాశాలు కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నది. ఆయన కు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు.
– సుంకరి కృష్ణ, పీఆర్టీయూ మెదక్ జిల్లా ప్రధానకార్యదర్శి
బడులు తెరవగానే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంతోపాటు నో ట్బుక్స్ ప్రభుత్వం అందజేయ డం సంతోషంగా ఉంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. ఆలాగే మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పిస్తూ ప్రభుత్వం బడులను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతుంది. కేసీఆర్ సర్కార్ నిర్ణయం సంతోషకరంగా ఉంది.
– శోభ, విద్యాకమిటీ చైర్పర్సన్,
ప్రభుత్వ బాలికల పాఠశాల మెదక్
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో అవసరమైన మేరకు పాఠ్యపుస్తకాలను 100శాతం పంపిణీ చే శాం. నోట్బుక్స్ కూడా త్వరలో పంపిణీ పూర్తి చేస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి. అనుభవజ్ఞులైన, అత్యున్నత అర్హత ఉన్న ఉపాధ్యాయులతో బోధన జరుగుతున్నది. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి.
– ఎస్.వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి