మెదక్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లో మెదక్ జిల్లా అగ్రగామిగా ఉన్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిషరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధత్వ రహిత తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా..
జిల్లాలో వానకాలంలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 91,379 మంది రైతుల నుంచి 3,93,578 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.810.77 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఈ యాసంగిలో 2,43,937 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అంచనా వేశామని, పెట్టుబడి సాయంగా రైతు బందు పథకంలో 2,34,690 మంది రైతులకు రూ.173.31 కోట్లు అందించామన్నారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం 12వ విడతలో 1,37,151 మందికి రూ.27.43 కోట్లు అందజేశామన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన 323 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా కింద రూ.5 లక్షల చొప్పున రూ.16.15 కోట్లు బీమా సొమ్ము చెల్లించామన్నారు.
జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 గోదాములు మాత్రమే ఉండగా, అదనంగా రూ.46.50 కోట్లతో 77,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో 21 గోదాములు నిర్మిస్తున్నామన్నారు. ధరణి పోర్టల్తో 68,057 భూ లావాదేవీలు, 12,236 గిఫ్ట్ డీడ్లు, 11,745 విరాసత్లు, 7,249 లావాదేవీలు నిర్వహించామన్నారు. రూ.43.64 కోట్లతో చేపట్టిన వన దుర్గా ప్రాజెక్ట్ ఆనకట్ట ఎత్తు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా కాళేశ్వ రం జలాలను 18,452 ఎకరాలకు అందించేందుకు రూ.185.75 కోట్లతో శంకరంపేట కాల్వ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. మిషన్ భగీరథ కింద 109 గ్రామాల్లో గోదావరి జలాలు, 408 గ్రామాలకు మంజీరా, 429 గ్రామాలకు సింగూరు జలాలు అందిస్తున్నామన్నారు.
జిల్లాలో అనేక సంక్షేమ పథకాల అమలు
పాడి పశువుల పథకం కింద రూ.5.44 కోట్ల సబ్సిడీతో 1,193 మందికి పాడి పశువులు అందించామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. గొర్రెల అభివృద్ధి పథకంలో భాగంగా రెండో విడత 7,184 మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దళితబంధు పథకంలో 59 మందికి పాడి పశువులు, గొర్రెలు, మేకల యూనిట్లు, రైతులకు 3 పౌల్ట్రీ యూనిట్లు అందించామన్నారు. మినీ డైరీ ఫాం, పౌల్ట్రీ ఫాం, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మినీ సూపర్ మారెట్ వంటి స్వయం ఉపాధి పథకాలకు జిల్లాలో 256 మంది లబ్ధిదారులకు రూ.25.34 కోట్లు అందించామన్నారు. మత్స్య కారుల ఆర్థికాభ్యున్నతికి 1,617 చెరువుల్లో 5 కోట్ల చేప విత్తనాలు వదిలినట్లు ఆమె తెలిపారు. ఆసరాలో 1,18,560 మంది వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, గీతా, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.25.63 కోట్లతో పింఛన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
పింఛన్ వయస్సు 57 ఏండ్లకు తగ్గించడంతో జిల్లాలో కొత్తగా 12,141 మందికి మంజూరయ్యాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదిముబారక్ కింద 3,440 మంది లబ్ధిదారులకు రూ.34.33 కోట్లు అందించామన్నారు. టీఎస్ఐపాస్ కింద జిల్లాలో 8,093 కోట్ల పెట్టుబడితో 759 పరిశ్రమలు స్థాపించి, 25,354 మందికి ఉపాధి కల్పించామన్నారు. మనఊరు మనబడి కార్యక్రమంలో 313 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పించామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రూ.5.50 కోట్లతో ఇందిరా గాంధీ అవుట్ డోర్ స్టేడియం, సింథటిక్ ట్రాక్, 270 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అనంతరం ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి సన్మానించారు. కులాంతర వివాహాలు చేసుకున్న 4 జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ఫిక్డ్స్ డిపాజిట్ బాండ్లు అందజేశారు.
ఎస్సీ అభివృద్ధి శాఖ, మెప్మా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బాలస్వామి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, డీపీవో సాయిబాబా, డీఈవో రమేశ్కుమార్, మత్య్స శాఖ ఏడీ రజని, పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, తూనికల కొలతల శాఖ అధికారి సుధాకర్, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి విజయశేఖర్రెడ్డి, మైన్స్ ఏడీ జయరాజ్, మిషన్ భగీరథ ఈఈ కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి కేశూరూం, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జెంల్లానాయక్, ఐసీడీఎస్ పీడీ బ్రహ్మాజీ, ఉద్యాన శాఖ అధికారి నర్సయ్య, డీఎస్వో రాజిరెడ్డి, ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు, తహసీల్దార్ కె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.