రాబోయే ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు వాడవాడలా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డిని సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. సమ్మేళనాలు దిగ్విజయం అయ్యేలా వీరు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పది గ్రామాలను ఒక యూనిట్గా ఎంచుకుని కార్యక్రమాలు చేపట్టనుండగా, ఏ మండలంలో ఏ రోజు నిర్వహించాలి..? ఏ గ్రామాలను యూనిట్గా కలపాలి…? పట్టణంలో ఎలా జరపాలి..? తదితర అంశాలపై ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసి క్యాడర్లో జోష్ నింపి ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.
సిద్దిపేట, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేసేం దుకు బీఆర్ఎస్ అధిష్టానం కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పార్టీ ఆత్మీయ సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలకు పార్టీ సమన్వయకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐ టీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లాకు పార్టీ జనరల్ సెక్రటరీ బోడకుంటి వెంకటేశ్వర్లు, మెదక్ జిల్లాకు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లే శం, సంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డిని నియమించారు. వీరు ఆయా జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు, ఇతర పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించారు. పది గ్రామాలను ఒక యూనిట్గా చేసుకొని ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చిన్న మండలాలు అయితే ఒకే సమావేశం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు కలిసి ఆత్మీయ సమ్మేళనాలకు అంతా సిద్ధం చేశారు. ఏ మండలంలో ఏ రోజు నిర్వహించాలి..? ఏ గ్రామాలు కలిపి ఒక్క దగ్గర నిర్వహించాలి…? పట్టణంలో ఎలా చేపట్టాలి..? తదితర అంశాలపై సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయా మండలాలు, పట్టణాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహిస్తారు. ఆయా జిల్లాల పార్టీ సమన్వయకర్తలు వీటిని సాఫీగా జరిగేలా చూస్తారు.
2023 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని మూడోసారీ భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ బాధ్యత ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇన్చార్జిలు సమన్వయం చేసుకుంటూ నిర్వహిస్తారు. సమావేశాలకు పార్టీలోని అందరిని కలుపుకొని ముందుకు సాగాలి. ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి మూడు జిల్లాల్లోని అన్ని మండలాలు, పట్టణాల్లో సమ్మేళనాలు పూర్తిచేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పార్టీ సమన్వయకర్తలను ఆదేశించారు. ముందస్తుగానే ఏ మండలంలో నిర్వహిస్తారో పార్టీ కార్యకర్తలు తెలియజేస్తారు.
ఆత్మీయ సమావేశాలు పూర్తిగా శిక్షణ తరగతుల మాదిరిగానే నిర్వహిస్తారు. కార్యకర్తలకు భోజన వసతిని ఏర్పాటు చేస్తారు. సమావేశాల్లో ఆ నియోజకవర్గం, మండలం, గ్రామాలు, పట్టణాల్లో ఏం అభివృద్ధి చేశాం.. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామనే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు విడమరిచి వక్తలు చెబుతారు. సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్యాడర్ తెలియజేస్తారు. ఎనిమిదిన్నర ఏండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధిని ప్రతి గడపకూ తీసుకుపోయేలా దిశానిర్దేశం చేస్తారు. ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు మూడు జిల్లాలో ఆత్మీయ సమావేశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పార్టీ సూచించింది. జయంతి రోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 25న గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరణ చేసిన అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ నిర్వహిస్తారు.
పార్టీ కార్యక్రమాలను విరివిగా చేపడుతూ ప్రజల్లో ఉండే విధంగా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ చేపట్టిన సం క్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. 75 ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదన్నరేండ్లలో ఎలా చేశామో పార్టీ క్యాడర్ ప్రజల్లోకి తీసుకుపోనున్నది. ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న బీఆర్ఎస్ మంచి జోష్పై ఉంది. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ల్లేలా క్యాడర్ సిద్ధం అవుతుంది. ఇందుకు కావాల్సిన కరపత్రాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల బుక్లను అందించనున్నారు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ తీసుకువచ్చిన నాడు నేడు బుక్లను కూడా పార్టీ క్యాడర్కు అం దించాలని మంత్రి కేటీఆర్ పార్టీ సమన్వయ కర్తలకు సూచించారు. ఇందుకోసం పార్టీ నేతలు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
హుస్నాబాద్రూరల్, మార్చి 22: నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే జన నేత సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో చేతిపై ఆయన చిత్రాన్ని టాటూ వేయించుకున్నాడు ఓ వీరాభిమాని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్కు చెందిన గూళ్ల యాదగిరి సీఎం కేసీఆర్కు అభిమాని. వృత్తిరీత్యా హైదరాబాద్లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు.సీఎం కేసీఆర్పై అమితమైన ఇష్టంతో ఆయన చిత్రాన్ని చేతిపై టాటూ వేయించుకుని అభిమాన్ని చాటుకున్నాడు. ఈ మేరకు ఇటీవల ఎమ్మెల్యే సతీశ్కుమార్ను హనుమకొండలోని ఆయన నివాసంలో యాదగిరి కలిసి తనకు సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపర్చాడు.