మెదక్, జూలై 7 (నమస్తే తెలంగాణ)/మెదక్ అర్బన్ : పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్రావు శనివారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో ఆర్డీవోలు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు శనివారం ఉదయం 10 గంటలకు నర్సాపూర్లోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు అందజేయనున్నారన్నారు. ఆ తరువాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్, శివ్వంపేట్ మండల జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించి పట్టాలు సిద్ధం చేయాల్సిందిగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి, తహసీల్దార్లకు సూచించారు. అనంతరం పాపన్నపేట మండలం ఏడుపాయల్లో నిర్మించిన మూడు బ్రిడ్జిలు, సీసీ రోడ్డు, బాచారంలో నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్లను ప్రారంభిస్తారని తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల ఈఈ, పంచాయత్ రాజ్ ఈఈని ఆదేశించారు. అనంతరం మెదక్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఉపశమన సంరక్షణ కేంద్రం, ఎంసీడీ క్లినిక్ను, పోలీస్ క్వార్టర్స్ను మంత్రి ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, పంచాయత్ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్రావు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, డాక్టర్ నవీన్ పాల్గొన్నారు.