సంగారెడ్డి, మార్చి 17(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదని, పార్లమెంట్ ఎన్నికల వేళ బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన గూడెం మహిపాల్రెడ్డి లాంటి బలమైన నేత తమ పార్టీకి వస్తే బాగుందని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఆయన బీఆర్ఎస్ను వీడేందుకు ససేమిరా అనడంతో ఆయన్ను మానసికంగా దెబ్బతీసి తనవైపు తిప్పుకొనే కుట్రలు ప్రారంభించిందంటున్నారు.
ఇందులో భాగంగానే అక్రమ మైనింగ్కు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేసోదరుడు మధుసూదన్రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. మూడునెలల వ్యవధిలో మధుసూదన్రెడ్డిపై మూడు కేసులు నమోదు చేయడం టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడి మేరకు మధుసూదన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని, మదసూధన్రెడ్డి అరెస్టు వెనక రాజకీయకుట్ర కోణం ఉన్నట్లు స్పష్టం అవుతున్నదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
మధుసూదన్రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని, నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులపైనా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను రాజకీయంగా ఎన్ని వేధింపులకు గురిచేసినా పార్టీ మారనని, కాంగ్రెస్ను రాజకీయంగా ఎదుర్కొంటానని, న్యాయవ్యవస్థ, చట్టాలపై తనకు గౌరవం ఉందని, తన సోదరుడిపై బనాయించిన అక్రమ కేసులు తొలిగి తమకు న్యాయం జరుగుతుందని గూడెం మహిపాల్రెడ్డి మీడియా సాక్షిగా చెప్పడంతో ఆయన్ను మరింత టార్గెట్ చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 200కు పైగా క్రషింగ్ కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, జిన్నారం మండలాల్లో ఎక్కువగా క్రషర్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కంపెనీలు మైనింగ్ లైసెన్స్లు పొందగా, తెలంగాణ ఏర్పాటు అనంతరం మరికొన్ని కంపెనీలు లైసెన్స్లు పొందాయి. తొమ్మిదిన్న ఏండ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ క్రషర్ల్ల జోలికి పోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అక్రమ మైనింగ్ను, అవినీతి, అక్రమ వసూళ్లను ప్రోత్సహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనింగ్పై దృష్టిపెట్టింది.
మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ప్రత్యేకంగా టాస్క్ఫోర్సు ఏర్పాటు చేసి క్రషర్లపై విచారణ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని క్రషర్లపై కాకుండా కేవలం 71 క్రషర్లపైనే విచారణను మొదలుపెట్టారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సోదరుడు నడుపుతున్న క్రష్టర్ల్లపై టాస్క్ఫోర్సు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 62 క్రష్టర్ల కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించాయని టాస్క్ఫోర్సు తన నివేదికలో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన క్రషర్ కంపెనీల్లో వేటిపైనా చర్యలు తీసుకోకుండా ప్రధానంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డిపైని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టి అరెస్టు చేయించిందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల క్రషింగ్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధ్దంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా చర్యలు లేవని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎలాంటి ఎన్ఓసీలు లేకుండా, తమకు కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో మైనింగ్ చేస్తున్నా, వాతావరణ కాలుష్యానికి పాల్పడుతున్నా కాంగ్రెస్ నేతల క్రషర్ల జోలికి ప్రభుత్వం వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు గులాబీ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు పెద్ద నేతల క్రషింగ్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధ్దంగా మైనింగ్ చేసినా వారిపై కేసులు పెట్టకపోవటాన్ని వారు తప్పుబడుతున్నారు.
సొంత పార్టీ నేతల మైనింగ్ కంపెనీలు కావడంతోనే వారిపై ప్రభుత్వం కేసులు పెట్టకుండా వెన్నుదన్నుగా నిలుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయని, రాజకీయంగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు గూడెం మధుసూదన్రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించిన తమపార్టీ నేతల మైనింగ్ కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటిని చూస్తుంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతున్నదని వారన్నారు.