అందోల్, జూన్ 11: సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు బఫర్జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలను కొంతమంది ఆక్రమించి.. భారీ భవనాలు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మిస్తున్నారు. మరికొందరు సరైన అనుమతులు, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండిగొడుతున్నారు.
సుమారు 500 వందల ఎకరాల్లో విస్తరించిన అందోల్ పెద్ద చెరువు అందోల్- జోగిపేట, మసాన్పల్లి శివారు వరకు విస్తరించి ఉంటుంది. అందోల్ బస్టాండ్ నుంచి జోగిపేట బస్టాండ్ వరకు పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నా, ఈ పరిధిలో ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రూ.కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు తమకేమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చిన్నాచితక రైతులు ఎవరైనా చెరువులో వారికి పట్టాలు ఉన్న స్థలంలో పశువులకు కొట్టాలు వేసుకుంటే గంటల వ్యవధిలో తొలిగిస్తున్నారు.
అందోల్-జోగిపేటలో అంతా పైసా కొట్టు నిర్మాణ అనుమతులు చేపట్టు అన్నట్లు సాగుతున్నది. ఒక్క ఫ్లోర్కు అనుమతి తీసుకుని 5 ఫ్లోర్లు కట్టడం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనుమతులు రాకున్నా, నిబంధనలకు విరుద్ధ్దంగా భారీ భవనాలు నిర్మించడం ఇష్టారాజ్యంగా మారింది. ఇలాంటి వాటిపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు, పాలకవర్గం వెనుకడుగు వేస్తున్నది. వారిచ్చే నజరానాలు తీసుకుని గమ్మునుండడంతో అందోల్-జోగిపేట యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
జోగిపేట నడి సెంటర్లో పాత హనుమాన్ టాకీస్ ప్రాంతంలో కారు వెళ్లేందుకు వీలులేని చోట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో వెనుక గోడకు అనుకుని పెద్ద చెరువు నీళ్లు పారుతుండగా, అందులోనే ప్రహరీ నిర్మించి, కాంప్లెక్స్ నిర్మాణం చేపతున్నాడు ఓ గోల్డ్ వ్యాపారి. అది కూడా మున్సిపల్ నుంచి అనుమతులు లేకుండానే. ఈ కాంప్లెక్స్లో ఒక్క నిబంధన పాటించడంలేదు.
ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజిన్ వచ్చే అవకాశం లేదు. పట్టణ నడి సెంటర్లో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నా కనీస చర్యలు చేపట్టడంలేదు. దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 500 వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందోల్ పెద్ద చెరువు ఇప్పటికే చాలా భాగం కబ్జాకు గురైందని, దాన్ని కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చెరువుకు నలువైపులా సర్వే నిర్వహించి కబ్జాలు తొలిగించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.