చేర్యాల, డిసెంబర్ 12 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి ఆదివారం సుమారు 20 వేల మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గం తెలిపింది. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారికి అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు స్వామివారి నిత్యకల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను భక్తులు దర్శించుకొని బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు రాతిగీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలను కట్టేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాకార్యక్రమాల్లో ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, డైరెక్టర్లు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.
‘మల్లన్న’ హుండీలో రూ.50వేలు వేసిన భక్తుడు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి హుండీలో హైదరాబాద్కు చెందిన అర్జున్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి రూ.50వేలను వేసి ఆదివారం మొక్కు చెల్లించుకున్నట్లు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వామి వారి క్షేత్రంలో భక్తులకు మెరుగైన సేవలు కల్పిస్తుండడంతో భక్తుల రద్దీ పెరిగిందన్నారు. భక్తులు సైతం స్వామివారికి మొక్కుల రూపంలో నగదు, వెండి, బంగారు ఆభరణాలు సమర్పించుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల హుండీ లెక్కింపులో కిలోకు పైగా అజ్ఞాత భక్తులు స్వామివారికి వెండి బిల్లలు వేసినట్లు తెలిపారు. ఆయనతో ఆలయ డైరెక్టర్ బొంగు నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.