2,206 కేసుల పరిష్కారం
బాధితులకు రూ.1.35 లక్షల పరిహారం అందజేత
రాజీమార్గమే రాజమార్గం: జిల్లా జడ్జి రఘురామ్
సిద్దిపేట టౌన్, జూన్ 26 : జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. జ్యుడీషియల్, పోలీస్ శాఖలు ముందస్తు అవగాహన ఫలించింది. ఆదివారం ఉదయం సిద్దిపేట కోర్టులో జిల్లా జడ్జి రఘురాం నేతృత్వంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. జాతీయ అదాలత్లో మొత్తం 2206 కేసులను పరిష్కరించారు. రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులకు రూ.1.35లక్షల పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రఘురాం మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమన్నారు. లోక్ అదాలత్లో న్యాయమూర్తులు భవాని, సం తోష్ కుమార్, శ్రావణి, న్యాయవాదులు జనార్దన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, తిరుపతిరెడ్డి, రఘుపతిరెడ్డి, మల్లికార్జున్, రాజు, పోలీసులు పాల్గొన్నారు.
రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలి
హుస్నాబాద్, జూన్ 26 : రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని మున్సిఫ్కోర్టు జడ్జి శివరంజని అన్నారు. ఆదివారం హుస్నాబాద్లోని కోర్టు ఆవరణలో జరిగిన నేషనల్ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయశాఖ కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగానే లోక్ అదాలత్లు నిర్వహించి కేసులను పరిష్కరిస్తున్నదని చెప్పారు. అనంతరం రాజీకి వచ్చిన కక్షిదారుల అంగీకారంతో పలు కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో అదనపు జడ్జి కృష్ణతేజ్, పీపీలు రవికిరణ్, నాగరాజు, ఏజీపీ కన్నోజు రామకృష్ణ, లోక్అదాలత్ సభ్యులు సుద్దాల చంద్రయ్య, చిత్తారి రవీందర్, న్యాయవాదులు హన్మయ్య, బాలకిషన్, మురళి, ఎస్సై శ్రీధర్, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.