మాఘ అమావాస్యను పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు లక్షమంది హాజరైనట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కడా ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కోలాహలంతో పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి.
మాఘ మాసంలో నదీస్నానం అత్యంత పుణ్యఫలమని భావిస్తారు. మాఘమ బహుళ అమావాస్యను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పలు పుణ్యక్షేత్రాల్లో శనివారం భక్తజనం పోటెత్తింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పవిత్ర నదుల్లో మాఘ స్నానం ఆచరించి భగవత్ సేవలో తరించడం అమోఘమనిపించింది! మాఘ అమావాస్య సందర్భంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో జాతర కొనసాగింది.
పాపన్నపేట, జనవరి 21: ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో భక్తజనం పులకించింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడి మంజీర నది పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మాఘ అమావాస్యను పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవానీ మాతకు వేద పండితులు వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్ భక్తులకు ఏర్పాట్లు చేశారు. వేకువ జామున పలుచగా కనిపించిన భక్తులు ఉదయం 11గంటల ప్రాంతంలో పోటెత్తారు. మంజీర నదిలోని వివిధ పాయల్లో, ఆలయం సమీపంలో ఉన్న షవర్లు, చెక్డ్యాములో స్నానాలు చేశారు. జహీరాబాద్, రాయిపల్లి, నారాయణఖేడ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు వాహనాలను చెలిమెల కుంట వద్ద నిలిపి ఆలయం వద్దకు నడిచి వెళ్లాల్సిరావడంతో కొంతమేర ఇబ్బందులను ఎదుర్కున్నారు. సంగారెడ్డి, హైదరాబాద్, నర్సాపూర్ వైపు నుంచి వచ్చినవారు సైతం టేకులగడ్డ వద్ద వాహనాలను నిలపడంతో ఇదే పరిస్థితి ఎదుర్కున్నారు.
దుర్గామాతను దర్శించుకున్న దేవేందర్రెడ్డి…
ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి శనివారం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నారు. పాలక మండలి ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతులను ఆయన పరిశీలించారు. పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఏర్పాట్లను పర్యవేక్షిచిన మెదక్ ఎస్పీ…
ఏడుపాయల వద్ద మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శనివారం బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులు నదిలో స్నానాలకు దిగి ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.