పటాన్చెరు, మార్చి 3: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు. పటాన్చెరు పట్టణం, పటేల్గూడ మధ్య సభకు వేదికను ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం జరిగే భారీ బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద వేదికపై డిజిటల్ తెరలను అమర్చుతున్నారు.
ప్రజలు నీడలో ఉండేలా భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. హెలీపాడ్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే భద్రతా దళాల హెలికాప్టర్ ట్రయల్స్ వేసింది. వేదిక వరకు హెలిప్యాడ్ నుంచి బీటీ రోడ్డును వేస్తున్నారు. ప్రధాని భద్రతా వ్యవహారాలు చూసే కేంద్ర భద్రత బలగాలు వేదిక వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ, పరిశీలిస్తున్నాయి. వేదిక చుట్టూ బారికేడ్లు అడ్డంగా పెడుతున్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల నుంచి సభకు జన సమీకరణకు బీజేపీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రధాని సభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.