న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించిన కోలీవుడ్ భామ ప్రియా భవానీ శంకర్. తనదైన నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ‘కళ్యాణం కమనీయం’తో టాలీవుడ్ను పలకరించింది. ఆ తర్వాత భీమా, జీబ్రా వంటి సినిమాల్లో మెప్పించినా అనుకున్నంత గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. తాజాగా ‘ఇరుముడి’లో రవితేజతో జత కట్టింది. ఈ సందర్భంగా కావేరి పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
నిన్ను కోరి, మజిలీ సినిమాలు చూసిన తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ గురించి తెలిసింది. రవితేజ చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇరుముడి’లో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా ఓ సామాన్య కుటుంబ కథగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నా పాత్రకు చాలామంది గృహిణులు కనెక్ట్ అవుతారు. నాలో వాళ్లను చూసుకుంటారు!
సందర్భమేదైనా మన జీవితం మనకు నచ్చినట్లు ఉండాలని కోరుకుంటాను. అలానే జీవిస్తాను. ఇది సోషల్ మీడియా జనరేషన్. తప్పును కూడా సమర్థిస్తుంటారు. నేను మాత్రం నా వైఖరిని కచ్చితంగా వెల్లడిస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను.
నా అసలు పేరు సత్యప్రియా భవానీ శంకర్. ఎంబీఏ పూర్తిచేసి న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించాను. స్క్రీన్ మీద కనిపించడం వల్ల చాలామంది సెలెబ్రిటీగా భావించేవాళ్లు. ఆ తర్వాత సీరియల్స్లో నటించాను. అక్కడి నుంచి మరో అడుగు ముందుకేసి 2017లో ‘మేయా దమాన్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాను.
ఏ బంధమైనా సరే… మీకు భారంగా అనిపిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేయండి. నేను అదే చేశాను. రాజ్ నా కాలేజ్మేట్. తనే నా మొదటి, చివరి బాయ్ఫ్రెండ్ కూడా! నేను అతనితో ప్రేమలో పడకముందు అతనికి చాలామందితో అఫైర్లు ఉండేవి. అందుకే, నాపై వచ్చే లేనిపోని పుకార్లకు చెక్ పెట్టడానికే నా బంధాన్ని బయటపెట్టాను. తన నుంచి దూరంగా ఉన్నాను.
మనుషులంతా పనిచేసేది డబ్బుకోసమే. సెలెబ్రిటీలకు అందుకు మినహాయింపు ఏమిలేదు. నేను కూడా డబ్బు సంపాదించుకోవడానికే ఇండస్ట్రీలోకి వచ్చాను. నా అభిప్రాయంపై గతంలో చాలామంది నెగెటివ్ కామెంట్లు పెట్టి నన్ను ట్రోల్ చేశారు. వాళ్లు కామెంట్లు పెట్టింది కూడా డబ్బుకోసమే కదా అని పట్టించుకోలేదు.