మెదక్, డిసెంబర్ 7: ప్రభుత్వ, సీలింగ్ భూములను మీరు ఎలా కొన్నారు.. రాజకీయంగా ఈటల జమున డ్రామా ఆడుతున్నారని.. అక్రమంగా ఎక్కడైనా గుంట స్థలం ఆక్రమించినట్లయితే మేము ముక్కు నేలకురాస్తామని.. మా దగ్గర రెండు సర్వేనంబర్లకు సంబంధించి 8.30 ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయని ఈటల జమున ఒప్పుకున్నది వాస్తవం కాదా అని మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ చంద్రాగౌడ్తో కలిసి మీడియాతో ఆమె మాట్లాడారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హక్కీంపేట గ్రామాల శివారులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు సంబంధించిన జమున హేచరీస్ అక్రమంగా 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములు కబ్జా చేశారని సర్వేలో తేలిందన్నారు. మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ శివారులో సర్వే నంబర్ 77, 78, 79, 80, 81, 82, 130, హక్కీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 97లో పూర్తి విస్తీర్ణం 70.33 ఎకరాలు అక్రమంగా కబ్జా చేసినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు హైకోర్టు ఆదేశాలు అనుగుణంగా సర్వే చేశారన్నారు. అచ్చంపేట, హక్కీంపేట గ్రామాలకు చెందిన సుమారు 56 మంది రైతులకు సంబంధించిన అసైన్డ్, ప్రభుత్వ భూములను జమున హేచరీస్ అక్రమంగా కబ్జా చేసిందని, ఇందులో పెద్దఎత్తున భారీ షెడ్లను, ప్లాట్ఫారాలు, రోడ్లు వేశారన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదిలా ఉండగా, 70 ఎకరాలు ఆక్రమించుకున్నామని మెదక్ కలెక్టర్ హరీశ్ చేసిన ప్రకటనపై కేసులు పెడతామని ఈటల జమున హెచ్చరించడం ఎంతవరకు సమంజసమని జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి ప్రశ్నించారు. జిల్లా మేజిస్ట్రేట్, రెవె న్యూ కోర్టుకు జడ్జిగా వ్యవహరిస్తున్న కలెక్టర్పై ఆరోపణలు చేయడం తగదన్నారు. కలెక్టర్ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని మాట్లాడితే బాగుంటుందని ఆమె అనడంపై మండిపడ్డారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్, ఒక మహిళగా ఉన్న నాపై వేధింపులకు పాల్పడుతున్నారని ఈటల జమున మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటని విమర్శించారు.
నోటీసులు ఇచ్చిన తర్వాతే సర్వే చేశారు:మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్
అనంతరం మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లా మా సాయిపేట మండలం అచ్చంపేట, హక్కీంపేట గ్రామ శివారులో జమున హేచరీస్ యాజమాన్యం అక్రమంగా భూ ములను ఆక్రయించుకున్నట్లు ఫిర్యాదు వచ్చాయన్నారు. దీనిపై అధికారులు ముందుగానే నోటీసులు జారీచేశారని తెలిపారు. అచ్చంపేట, హక్కీంపేట శివారులో అసైన్డ్, సీలింగ్ భూములను కొనడం గానీ, అమ్మడం గాని నేరమన్నారు. ఇవన్నీ తెలిసి ఈటల ఈ భూములను కొనుగోలు చేయడం, అలాగే కబ్జాకు పాల్పడడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి పనికి పాల్పడడం సరైంది కాదని ఆయన విమర్శించారు.
భూములు ఇప్పించాలని బాధితుల వినతి…
తాము సాగుచేస్తున్న భూములను ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్ యాజమాన్యం కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని అచ్చంపేట గ్రామానికి చెం దిన రైతులు శ్రీనివాస్, చాకలి అనిత, కలమ్మ, రాజమణి, లక్ష్మి, రాంచందర్, కృష్ణ, బుచ్చమ్మ, శ్రీనివాస్, నాగులు విన్నవించారు. వీరంతా మంగళవారం మెదక్లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తమ భూములు తమకు ఇప్పించాలని అక్కడనున్న మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తాము సాగుచేసుకుంటున్న భూములను కబ్జా చేశారని, తాము భూములు అమ్మినట్లు నిరూపిస్తే జమున హేచరీస్ యాజమాన్యానికి గులాంగిరీ చేస్తామన్నారు.
మా భూములు మాకు ఇప్పించండి..
మాసాయిపేట మండలం హక్కీంపేట గ్రామ శివారులోని 130 సర్వేనంబర్లో ఎకరా 20 గుంటల భూమి మాకు ఉంది. మాకు తెలియకుండా కబ్జా చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టారు. మా భూమిని కబ్జా చేశారని, మేము వెళ్లి అడిగితే మీ భూమి ఇక్కడ లేదని గెంటేశారు.
-చాకలి రాజమణి, హక్కీంపేట
మీదెక్కడిది భూమి అంటున్నారు..
మాసాయిపేట మండలంలోని హక్కీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 130లో రెండు ఎకరాల భూమి మాకు ఉంది. మేము ఎప్పుడు వెళ్లినా ఇది మీభూమి కాదంటూ పంపించేశారు. ఎన్నిసార్లు ఎంతమంది వద్దకు వెళ్లినా మమ్మల్ని మాట్లాడనీయలేదు. మా భూములు మాకు కావాలని కోరుతు న్నాం. జమున హేచరీస్ పరిశ్రమ విడిచే వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-రాంచంద్రం, హక్కీంపేట సర్పంచ్ భర్త