సంగారెడ్డి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీరవితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 22 వరకు జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలు తమ ఇండ్లపై జెండా ఎగుర వేసేందుకు వీలుగా జాతీయ జెండాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 3.43 లక్షల జెండాల పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 10న జిల్లాలో 75 ఫ్రీడమ్ పార్కులను ప్రారంభించినట్లు తెలిపారు. ఫ్రీడమ్ పార్కుల్లో 2.32 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు. 11న జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఫ్రీడమ్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. 13న సంగారెడ్డితోపాటు అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంగారెడ్డిలో నిర్వహించే ర్యాలీకి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ర్యాలీలో విద్యార్థులు 750 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించనున్నట్లు చెప్పారు.
సంగారెడ్డి కలెక్టరేట్లో నూతనంగా 75 అడుగుల జాతీయ జెండాను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. 75 అడుగుల భారీ జాతీయ జెండాను శనివారం మంత్రి హరీశ్రావు ఎగురవేస్తారని చెప్పారు. 14న జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పటాకులు కాల్చనున్నట్లు చెప్పారు. 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 16న జాతీయ గీతాలాపన, 17న రక్తదాన శిబిరాలు, 18న క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం, 19న దవాఖానలు, అనాథశరణాలయాల్లో పండ్ల పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21న అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. వజ్రోత్సవ వేడుకల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించనున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు వేడుకల్లో పాల్గొని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఏ శ్రీనివాస్, ఆర్డీవో మెంచు నగేశ్, సంగారెడ్డి డీఎస్పీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్లో భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో 75 అడుగుల ఎత్తు భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణం పనులు పూర్తయ్యాయి. జాతీయ జెండాను ఎగురవేసేందుకు వీలుగా 75 అడుగుల స్తంభాన్ని ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 11గంటలకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు 75 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధిక ఎత్తులో ఏర్పాటు చేస్తున్న జాతీయ జెండా కలెక్టరేట్లో ఏర్పాటు కానుండడం విశేషం.