సంగారెడ్డి జూలై 21(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో వర్షం జోరు కురుస్తున్నది. శుక్రవారం ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సాయంత్రం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. జిల్లా అంతటా 40.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 14 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 12 మండలాల్లో సాధారణం కంటే 59 శాతం అధికంగా కురిసింది. రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పుల్కల్ మండలంలో అత్యధికంగా 10.2 సెం.మీటర్లు, అత్యల్పంగా కంగ్టి మండలంలో 2.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. చౌటకూరు 10.1 సెం.మీ, గుమ్మడిదల 9.7, జిన్నారం 9.4, హత్నూర 9.2, రామచంద్రాపురం 8.5, సంగారెడ్డి 7.8, పటాన్చెరు 7.4, అందోల్ 7,3 సెం.మీటర్ల వర్షం కురిసింది. అమీన్పూర్ 7.1 సెం.మీ, వట్పల్లి 6.6సెం.మీ, సదాశివపేట 6.5 సెం.మీ, మునిపల్లి 6.4 సెం.మీ, కంది 6.3 సెం.మీ, నిజాంపేట 6.2 సెం.మీటర్ల వర్షం కురిసింది. మిగితా మండలాల్లో 5 నుంచి 3 సెం.మీటర్ల వర్షం కురిసింది.
నిండు కుండల్లా జలాశయాలు
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో నిండుకుండల్లా కనబడుతున్నాయి. చాలా గ్రామాల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. జహీరాబాద్లోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే మాణిక్రావు సందర్శించారు. జహీరాబాద్లోని వసంత విహార్ కాలనీ లోతట్టు ప్రాంతాలను పరిశీలించి కలెక్టర్ ఎగువ ప్రాంతం నుంచి కాలనీలోకి వచ్చిన వర్షం నీరు దిగువ ప్రాంతానికి వెళ్లేలా చూడాలని ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. చెరువు కాల్వ నీళ్లు వెళ్లకుండా అడ్డుకుంటున్న ప్రైవేట్ వెంచర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కారణంగా పటాన్చెరు, హత్నూరలో రెండు ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి.
సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులోకి భారీగా వరద
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 12,515 క్యూసెక్కుల జలాలు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 20.267 టీఎంసీలకు చేరుకుంది. సిర్గాపూర్లోని నల్లవాగు ప్రాజెక్టులోకి 1130 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టు నీటి మట్టం 556.060 ఎంసీఎఫ్టీలకు చేరుకున్నది. వర్షాలతో జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండి ప్రవహిస్తున్నది. నీటి ఉధృతి పెరగడంతో నీటిపారుదల అధికారులు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
వర్షాలతో నిండుతున్న చెరువులు
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుతున్నాయి. జిల్లాలో మొత్తం 1374 చెరువులు ఉండగా వీటిలో 13 చెరువులు అలుగు పారుతున్నాయి. 21 చెరువులు పూర్తిగా నిండా యి. సంగారెడ్డి ఇరిగేషన్ డివిజన్లో మహబూబ్సాగర్ చెరువు అలుగు పారుతున్నది. సదాశివపేటలోని గంగకత్వ నిండుగా ప్రవహిస్తున్నది. జహీరాబాద్ డివిజన్లోని పెద్దవాగు, గొటిగార్పల్లి చెరువులతోపాటు మరో ఆరు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. నారాయణఖేడ్ డివిజన్లో గంగాపూర్ చెరువు, ర్యాకల్ రిజర్వాయర్ నిండా యి. అందోలులో అన్నసాగర్ చెరువు అలుగు పారుతున్నది.
ఆక్రమణలు తొలిగించాలి
జహీరాబాద్, జూలై 21: వరద నీటి కాల్వల ఆక్రమణలను తొలిగించేందుకు నీటి పారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సర్వే చేయాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం జహీరాబాద్లోని బైపాస్ రోడ్డు వసంత్ విహార్ కాలనీతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లలోని కాలనీలు వరద నీటిలో ముగినిపోయాయి. పట్టణంలోని పలు వార్డుల నుంచి వరద బయటకు వెళ్లుకుండా ఇండ్లలోకి వస్తున్నదని కాలనీవాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని గడి ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖ ర్, ఆర్డీవో వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ జి.గుండప్ప, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్య ద్ మోయినోద్దిన్, నాయకులు శ్రీకా ంత్రెడ్డి, సీఎం మాణిక్రెడ్డి, అరుణకుమార్ ఉన్నారు.