జలమయమైన రహదారులు
ఈదురుగాలులతో విరిగిపడిన చెట్ల కొమ్మలు
నాలుగు గంటల పాటు విద్యుత్కు అంతరాయం
ఇబ్బందిపడిన వాహనదారులు
నేలరాలిన మామిడి కాయలు, తడిసిన ధాన్యం
సంగారెడ్డి అర్బన్, మే 18: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి పట్టణ రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన పట్టణవాసులు వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడడంతో సుమారు 4 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
దౌల్తాబాద్లో కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం
మునిపల్లి భారీ వర్షం..
మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. మండలంలో కురిసిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో మామిడి కాయలు నేలరాలాయి. పలు గ్రామాల్లో రైతులు పండించిన వరి చేతికి అందకుండా దెబ్బ తిన్నది. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని రైతన్నలు ఆర్థికంగా నష్టపోతున్నారు.
హత్నూరలో..
హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిముద్దయ్యింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పుల్కల్లో..
మండల కేంద్రంలో బుధవారం జోరుగా వానపడింది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. రైతులు అప్పటికప్పుడు టాపర్లు తీసుకొచ్చి ధాన్యం తడవకుండా కప్పినా ఫలితం లేకుండా పోయింది.