ఈదురుగాలులతో కూడిన వాన మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో కోతదశలో ఉన్న వరితో పాటు కళ్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. చాలాచోట్ల ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలిదుమారానికి ఇండ్లపై రేకులు లేచిపోయాయి. కొన్ని గ్రామాల్లో పిడుగుపాటుకు ఎద్దులు, బర్రెలు మృత్యువాత పడ్డాయి. ఆయాగ్రామాల్లో వ్యవసాయాధికారులు పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు.
మెదక్, మే4: మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణంతో పాటు గ్రామాల్లో అంధకారం నెలకొన్నది. మాసాయిపేట మండలం బొమ్మారం గ్రామంలో ఈదురుగాలులకు ఇంటి పై కప్పు ఎగిరిపోయింది. నర్సాపూర్, మనోహరాబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మనోహరాబాద్ రైల్వే బ్రిడ్జి వద్ద వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. శివ్వంపేట మండలం మల్లుపల్లికి చెందిన కేతావత్ విఠల్కు చెందిన రెండు గేదెలు పిడుగుపాటుకు మృతి చెందాయి.
రాలిన మామిడి
చేగుంట,మే4: చేగుంట బైపాస్, అనంతసాగర్, కర్నాల్పల్లి, ఇబ్రహీంపూర్, చందాయిపేట్, బోనాల్తో పాటు నార్సింగి మండంలోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. తూప్రాన్ మండలంలో మొక్కజోన్న నేలకొరిగింది. మామిడి కాయలు నేలరాలాయి.
తడిసిన ధాన్యం
చిలిపిచెడ్, మే4: చిలిపిచెడ్ మండలంలో మంగళవారం రాత్రి ఫైజాబాద్, బండపోతుగల్, అజ్జమర్రి, చండూర్ తదితర గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిసింది. చిలిపిచెడ్లో వరదకు ధాన్యం కొట్టుకుపోయింది.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, మే4: వెల్దుర్తి, మాసాయిపేటతో పాటు మండలంలోని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, పొలాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల వర్షం నీటికి బండలపై ఆరబోసిన ధాన్యం కొట్టుకు పోవడంతో రైతులు గంపలతో ఎత్తారు. వెల్దుర్తి -మెదక్ ప్రధాన రోడ్డుపై రామాయిపల్లి సమీపంలో చెట్టు విరిగిపడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపపడ్డాయి. తడిచిన ధాన్యంను వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు నమోదు చేశారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదు
మెదక్, మే4: బుధవారం తెల్లవారుజామున గాలి, వాన బీభత్సం సృష్టించింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 20.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తూప్రాన్లో 60.2 మి.మీ, అత్యల్పంగా నార్సింగిలో 2.8 మీ.మీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 20.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్చారంలో 38.2 మి.మీ, చిన్నశంకరంపేటలో 34.7 మి.మీ, కౌడిపల్లిలో 24.4 మి.మీ, రామాయంపేటలో 21.9 మి.మీ, శివ్వంపేటలో 28.9 మి.మీ, వెల్దుర్తిలో 34.9 మి.మీ, మనోహరాబాద్లో 34.9 మి.మీ, మాసాయిపేటలో 43 మి.మీలు, నర్సాపూర్లో 4.3 మి.మీ, చిలిపిచెడ్లో 16 మి.మీ, మెదక్లో 8.8 మి.మీ, చేగుంటలో 27.9 మి,మీ, అల్లాదుర్గంలో 18.5 మి,మీ, పాపన్నపేటలో 2.5 మి.మీ, హవేళీఘనపూర్లో 11 మి.మీ, రేగోడ్లో 3.3 మి,మీ, టేక్మాల్లో 10.2 మీ,మీల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పిడుగుల వాన
రామాయంపేట/రామాయంపేటరూరల్, మే4: బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్డు పక్కనే ధాన్యం ఆరబోసిన వడ్లు వరదకు కొట్టుకు పోయాయి. రామాయంపేట మార్కెట్ కమిటీలో ఆరబోసిన ధాన్యం నీళ్లతో నిండిపోయింది. మండలంలోని రామాయంపేట, పర్వతాపూర్ గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. కొబ్బరి చెట్లుపై పడటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొన్ని గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలడంతో ట్రాన్స్ఫారాల్లో విద్యుత్ నిలిచిపోయింది.
శివ్వంపేటలో పిడుగుపాటు
శివ్వంపేట, మే 4: శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల, చిన్నగొట్టిముక్కల, రత్నాపూర్, చెన్నాపూర్, గోమారం, మల్లుపల్లి, శివ్వంపేట, గూడూరు గ్రామాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. గాలివానకు శివ్వంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఒక గేదెలు, ఒక ఆవు పిడుగు పాటుకు మృతిచెందాయి.
చేతికొచ్చిన పంట నేలపాలు
అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని చిలిపిచెడ్, పాపన్నపేట మండలం కొడపాకలో, రామాయంపేట మండలాల్లో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. రామాయంపేట శివారులోని కోమట్పల్లి, గొల్పర్తి గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో కురవడంతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల వద్ద అరబోసిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పారు. జిల్లాలోని ఆయా మండలాల్లో వరి పొలాలు నేలకొరిగాయి. జిల్లాలో 80 శాతం పొలాల్లో కోతలు పూర్తయ్యాయి. మరో 20 శాతం కోతకొచ్చాయి. ఈ సమయంలో అకాల వర్షం కురవడంతో పొలాలన్నీ దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం నీటిపాలైంది.
ఈదురుగాలులు.. ఉరుములు, మెరుపులు
నిజాంపేట, మే4: నిజాంపేటతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నూర్పిడి దశకు చేరుకున్న పంట నేలకొరిగింది. మండల వ్యాప్తంగా 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వ్యవసాయ శాఖ అధికారులు వర్ష తీవ్రత అధికంగా ఉన్న గ్రామా ల్లో సందర్శించి, పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు.
ఆగం చేసిన అకాల వర్షం
వరి, మొక్కజొన్న పంటలను కాపాడుకుంటూ వస్తున్నా. తెలంగాణ సర్కారు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్తో పంట బాగా పండింది. ఆ పంటను పశువులు, పక్షుల బారి నుంచి కాపాడుకుంటూ వచ్చిన. మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో పంట అంతా నేలకొరిగింది. ధాన్యం మొత్తం తడిసిపోయింది.
– రాజయ్య, రైతు, నిజాంపేట
ప్రభుత్వం ఆదుకోవాలి
కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయం లో భారీ వర్షం కురిసి నేలకొరిగింది. పంట పండి తే అప్పులు కడదామనుకున్నా. ఈ వర్షంతో ధాన్యం మొత్తం తడిసి ముద్ద య్యింది. ఇప్పుడు మళ్లీ అప్పులే మిగిలాయి. ప్రభుత్వం మాలాంటోళ్లను ఆదుకోవాలి.
– ఎర్ర ఎల్లయ్య, రైతు, నిజాంపేట