జహీరాబాద్, ఫిబ్రవరి 8: నిండు శాసనసభలో తమ గ్రామం పేరును ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రస్తావించడంపై ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గతంలో ‘హద్నూర్కు ఎద్దునివ్వొద్దు.. బోరంచకు పిల్లనివొవ్వద్దు’ అని మా ప్రాంతంలో ఓ సామెత ఉందన్నారు. ఈ సామెత ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో గ్రామాలకు కరెంట్ సౌకర్యం లేదు. దీంతో రైతులు వ్యవసాయ పంటలు సాగు చేసేందుకు ఎడ్లతో బావుల వద్ద మోట కొట్టేవారు.
బావుల నుంచి నీటిని పైకి తీసుకువచ్చేందుకు పశువులను ఉపయోగించేవారు. ఎడ్లతోనే బావుల నుంచి తాగునీరు, సాగు నీటిని తోడేవారన్నారు. హద్నూర్లో బావులు ఎక్కువ లోతుగా ఉండడంతో ఎడ్లకు కష్టంగా ఉండేది. దీంతో అక్కడకు అమ్మకాలు చేసే వారు కాదన్నారు. బోరంచకు పిల్లనివ్వొదు ఎందుకు అనే వారు అంటే మంజీరా నది పక్కన ఎత్తైన గట్టుపై గ్రామం ఉండేది. తాగునీటి కోసం మహిళలు మంజీరా నదికి వెళ్లి బిందెలతో నీటిని తీసుకొచ్చే వారని, ఆ గ్రామానికి ఆడపిల్లలనిస్తే కష్టాలు ఎక్కువ అని ఎవరూ పిల్లను ఇచ్చే వారు కాదంట అని ఆ సామెత ఎందుకు వచ్చిందో వివరించారు. ఇప్పుడు ఆయా గ్రామాలకు తాగు, సాగునీరు పుష్కలంగా అందుతున్నాయని, దీంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి గుర్తుచేశారు.