పటాన్చెరు, సెప్టెంబర్ 14: మండలంలోని కర్ధనూర్ పంచాయతీకి స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీ సమావేశ మందిరంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2023 అవార్డుల కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా సర్పంచ్ ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి, కార్యదర్శి నీలిమాకు అవార్డు అందజేశారు. అన్ని రంగాల్లో కర్ధనూర్ పంచాయతీ అభివృద్ధి చెందడంతో ఈ అవార్డు వరించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కర్ధనూర్ సర్పంచ్ను, పాలకమండలిని, కార్యదర్శిని అభినందించారు. రాష్ట్రంలోని పంచాయతీలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు.
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రతి పంచాయతీలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు. పోటీపడి పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. హరితహారం, పల్లె ప్రకృతివనాలు, డంప్యార్డులు, వైకుంఠధామాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు వేదికలు, సీసీ రోడ్లు, పంచాయతీ ట్రాక్ట ర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నాణ్యమైన విద్యుత్తో గ్రామాలు పట్టణాలకు దీటుగా మారాయన్నారు.
దేశంలోనే ఉత్తమ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు. సంగారెడ్డి జిల్లా నుంచి కర్ధనూర్కు అవార్డు రావడం సంతోషకరమన్నారు. పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, డీపీవో సురేశ్మోహన్, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఉప సర్పంచ్ వడ్డే కుమార్, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపీవో హరిశంకర్గౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.