సిద్దిపేట, జూన్ 15: ఆయిల్పామ్ సాగును మరింత ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కలిపించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ అధికారులతో ఆయిల్పామ్ సాగుపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలోనే ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో 1600 మంది రైతులు 4,800 ఎకరాల్లో సాగు చేశారని, ఈ ఏడాది సిద్దిపేట నియోజకవర్గంలో మరో 2 వేల ఎకరాల సాగు లక్ష్యంగా పనిచేయాలన్నారు. మెగా ప్లాంటేషన్కు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆయిల్ఫెడ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండటం లేదని తన దృష్టికి వచ్చిందని, యాప్తో లింక్ లేకుండా ఆయిల్పామ్ రైతులకు యూరియా అందించాలని ఆదేశించారు. పంట దెబ్బ తినకుండా సమయానుకూలంగా నీరు, ఫర్ట్టిలైజర్ అందించాలన్నారు.
ప్రతి 6 నెలలకు ఒకసారి మెగ్నీషియం, బోరాన్, ప్రతి మూడు నెలలకోసారి పొటాష్, యూరియా, ఎస్ఎస్పీఈ ఆరు రకాల మందులు రైతులు సమయం ప్రకారం వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మొకల చుట్టూ గడ్డి పెరగకుండా రైతులకు తెలియజేయాలన్నారు. కొత్తగా సాగు పెంచేలా ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఫీల్డ్ అధికారులు ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్ చేసి, రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. రైతులకు సబ్సిడీపై వచ్చే పనిముట్లు అందించాలని హరీశ్రావు సూచించారు.