సిద్దిపేట/సిద్దిపేట ఆర్బన్, జూన్ 20: తెలంగాణలోని అన్ని జైళ్లతో సౌకర్యాలు కల్పించి ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడంలో రాష్ట్ర జైళ్ల శాఖ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో 34 ఎకరాల్లో రూ.78 కోట్లతో జిల్లా జైలు నిర్మాణానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటీ దామోదర్, జైళ్ల శాఖ డీజీ జితేందర్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటీ రోజారాధాకృష్ణశర్మ, జైళ్ల ఐజీ రాజేశ్ డీఐజీ మురళీబాబు, సీపీ శ్వేతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాటాడుతూ ఎడెనెమిదేండ్ల కృషితో జిల్లా జైలు వచ్చిందని, కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మొదటి జైలు ఇదే అన్నారు.
ఇందులో 425 మంది ఖైదీలకు అవకాశం ఉంటుందని, ఇక్కడే ఓపెన్ జైలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సబ్జైలును సైతం ఇక్కడికే తరలిస్తామన్నారు. ప్రస్తుత సబ్ జైలును మున్సిపాలిటీ లేదా రెవెన్యూ కార్యాలయానికి వాడుకోనున్నట్లు చెప్పారు. జైళ్ల శాఖ డీజీ జితేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సత్ప్రవర్తక కలిగిన 400 మంది ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం వల్ల రిపీటెడ్గా జైలుకు వచ్చే వారి సంఖ్య 8 శాతం నుంచి 2 శాతానికి తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లం ఎల్లం, సర్పంచ్ రవీందర్గౌడ్, నాయకులు మచ్చ వేణుగోపాల్రెడ్డి, నాగుల ప్రశాంత్, జనార్దన్రెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు.