సిద్దిపేట, జూలై 19 : కుల సంఘ భవనాలు ఆత్మీగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో చిన్నకోడూరు మండలంలోని ఒబులాపూర్ ఓపెన్ జిమ్, మల్లారం రెడ్డి కమ్యూనిటీ హాల్, చెల్కలపల్లి కుర్మ యాదవ సంఘం, చిన్నకోడూరు ఎస్సీ మాల సంఘం, పెద్దకోడూరు – లింగారెడ్డిపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్, నారాయణరావుపేట మండలం మల్యాల గౌడ కమ్యూనిటీ హాల్ షెడ్, నంగునూరు మండలం దర్గపల్లి వెల్మ ఫంక్షన్ హాల్ కుల సంఘ భవనాలకు మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. అంతకు ముందు నంగునూరు మండలం పాలమాకుల గ్రేవ్ యార్డు, ముండ్రాయి డంప్ యార్డులకు స్థలాన్ని కేటాయించిన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి తన కుటుంబంలా భావించి మీ అందరికీ సేవ చేస్తున్నట్లు.. ప్రజా సేవలో సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రతి కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని కమ్యూనిటీ హాళ్లతో పాటు సంఘ భవనాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రి అహర్నిషలు కృషి చేస్తున్నారని భవనాల నిర్మాణాలకు మంత్రి చేస్తున్న సేవలు మరువలేనివని పలువురు మండలాల ప్రజాప్రతినిధులు కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద సంక్షేమానికి పనిచేసే ప్రభుత్వమని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయం లో నియోజకవర్గ పరిధిలోని 154 మందికి సీఎం సహాయనిధి కింద రూ.49.05 లక్షల చెక్కులు, ఒకరికి పార్టీ బీమా చెక్కు మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ప్రమాదంలో మృతి చెందిన 48 మందికి బీఆర్ఎస్ ఇన్సురెన్స్ ద్వారా రూ.96 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. చెల్కలపల్లి గ్రామానికి చెందిన మహేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అతడి భార్య గిరిజకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ బీమా చెక్కులు అందజేశారు.