సిద్దిపేట/ హుస్నాబాద్/ బెజ్జంకి, మార్చి 19: వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మంగళవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. సిద్దిపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులతో వృక్షాలు కూలిపోయాయి. వర్షం కురవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్, పెద్దకోడూరులో మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలడంతో సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు సిద్దిపేట పట్టణం అంధకారంలో ఉండాల్సి వచ్చింది. హుస్నాబాద్ పట్టణంతోపాటు డివిజన్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. బెజ్జంకి మండల పరిధిలో తీవ్ర గాలిదుమారంతోపాటు ఉరుములు, మెరుపులతో వాడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి.