మునిపల్లి, జూన్ 24: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల(బాలుర) హాస్టల్ భవనం గతేడాది సెప్టెంబర్ 9న కూలిపోయింది. అప్పట్లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, అప్పటి కలెక్టర్, ఉన్నతాధికారులు వచ్చి హడావిడి చేశారు. లింగంపల్లి గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత జీవో విడుదల చేశారు. కాంగ్రెస్ మునిపల్లి మండల నాయకులు ప్రెస్మీట్లు పెట్టి, కొత్త భవనం కడతామని విలేకరుల ఎదుట గొప్పలు చెప్పారు. కానీ, లింగంపల్లి గురుకుల పాఠశాల హాస్టల్ నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మంత్రి దామోదర రాజనర్సింహ హామీఇచ్చి 290 రోజులు గడుస్తున్నాయి. పనులు ప్రారంభించక పోవడంతో మంత్రికి గుర్తుందా అని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
లింగంపల్లి గురుకుల పాఠశాలలో 600 మందికి పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సరైన వసతిగృహం, డైనింగ్హాల్ లేకపోవడంతో రోడ్ల పక్కన ఉన్న చెట్ల కింద కూర్చోని భోజనాలు చేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనాల దుమ్మూధూళి పడడంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. విద్యార్థులు ఒకే గదిలో చదువుకోవడం, నిద్రపోవడంతో గురుకుల పాఠశాలలు అంటేనే విరక్తి చెందుతున్నారు. రాష్ట్ర వైద్యరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించేలా చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.
లింగంపల్లి గురుకుల పాఠశాల నూతన భవనాన్ని సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. విద్యార్థులకు హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. హాస్టల్ నూతన భవనం నిర్మాణం చేపట్టాలి.
– సురభి చైతన్య, ప్రిన్సిపాల్, లింగంపల్లి గురుకుల పాఠశాల (సంగారెడ్డి జిల్లా)