సంగారెడ్డి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్ సర్కారు గృహజ్యోతి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈనెల 8వ తేదీ నుంచి విద్యుత్ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. పేర్ల నమోదుకు 15వ తేదీ తుది గడువుగా ప్రభుత్వం తొలుత ప్రకటించింది. కానీ, 15వ తేదీ వరకు పేర్ల నమోదు ప్రక్రియ వందశాతం పూర్తికాక పోవడంతో గడువును ఈనెల 18 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు సగం మంది మాత్రమే వివరాలు నమోదు చేయించుకున్నారు.
ఆదివారం ఒక్కరోజే గడువు ఉండడంతో వందశాతం నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ పథకం ఇప్పట్లో అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక తెల్లరేషన్కార్డుదారులకు మాత్రమే వర్తింపజేస్తామని ప్రకటించింది. దీంతో తెల్లరేషన్కార్డు లేనివారు ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ప్రస్తుతం తెల్లరేషన్కార్డు ఉన్న వారి వివరాలను మాత్రమే విద్యుత్ సిబ్బంది నమోదు చేసుకుంటున్నారు. తెల్లరేషన్కార్డు లేనివారు చాలామంది పేదలు ప్రజాపాలనలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గృహజ్యోతి పథకం వర్తింపజేసే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది. కఠిన నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 5,50,254 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో నాలుగు విద్యుత్ సబ్ డివిజన్ల పరిధిలో ఇప్పటి వరకు 2,29,521 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి డివిజన్ పరిధిలో 69,177, పటాన్చెరులో 46,007, జహీరాబాద్లో 55519, జోగిపేటలో 58,818 మంది పేర్లను నమోదు చేశారు. ఇంకా 3,20,733 వినియోగదారుల నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది. పల్లెల్లో దాదాపుగా పేర్ల నమోదు ప్రక్రియ పూర్తి కాగా, పట్టణాల్లో 60శాతం వరకు మాత్రమే పూర్తయినట్లు తెలిసింది. ప్రభుత్వం గడువును పొడిగించపోతే చాలామంది నష్టపోయే అవకాశం ఉంది.
మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో 1.60 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహజ్యోతి కోసం ఇప్పటి వరకు లక్షా20 వేల మంది లబ్ధిదారుల వివరాలను సేకరించారు. మరో 40వేల మంది వివరాలు సేకరించాల్సి ఉంది. నమోదు ప్రక్రియ 75 శాతం పూర్తయిందని సివిల్ సప్లయ్ జిల్లా అధికారి బ్రహ్మారావు తెలిపారు.