కొల్చారం, డిసెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకానికి మత్స్యకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. రైతులు వివిధ రకాల పంటల సాగుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు. పాడి బర్రెలు, కోళ్ల పెంపకంతో పాటు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం యాసంగిలో వరిసాగు చేయకుండా ఇతర పంటలు సాగు చేయాలని సూచించడంతో మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో కొంత మంది రైతులు వినూత్నంగా ఆలోచించి చేపల పెంపకాన్ని ప్రారంభించారు. చేపల పెంపకానికి ఎంత భూమి అవసరం, పెట్టుబడి వివరాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, చేపలు పెంచిన తర్వాత మార్కెటింగ్ సమస్యలు ఏమైనా ఉంటాయా? చేపల పెంపకానికి కావల్సిన పాండు(గుంత) తవ్వకం, చేప పిల్లలు, దాణా, ఇతర ఖర్చుల వివరాలను ఇప్పటికే చేపలను పెంచుతున్న రైతులను అడిగి తెలుసుకుంటున్నారు.
చెరువుల తవ్వకం..
చేపల చెరువు తవ్వకానికి రైతుకు ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి పావు ఎకరం నుంచి ఎకరం వరకు ఎంత విస్తీర్ణంలోనైనా చేపల చెరువును తవ్వుకోవచ్చు. చేపల చెరువు తవ్వకానికి బంకమట్టి నేలలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘచతురస్రాకారంలో చెరువులను తవ్వుకోవాలి. చెరువుల త వ్వకంలో ముందుగా చుట్టూర గట్లు వేసుకోవాలి. గట్ల వెంట మొక్కలను పెంచుకోవాలి. ఆరు అడుగుల లోతు కంటే ఎ క్కువ లోతులో ఉండాలి. చేపల పెంపకానికి నీరు ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. తెల్ల చేపలను, నల్ల చేపలను వేర్వేరు పాండు(గుంతల్లో) పెంచుకోవాలి. చేపల పెంపకానికి కూలీల అవసరం కూడా ఉండదు. చేప పిల్లలను పిట్టల నుంచి రక్షణ కోసం పాండు(గుంత)లపై వల(జాలీ)లను ఏర్పాటు చేసుకోవాలి.
రకాలు..
నాకు అయిదు పాడి బర్రెలు ఉన్నాయి. పొలం వద్దనే కొట్టం ఏర్పాటు చేసుకుని వాటిని పెంచుతున్నాను. కూలీలు దొరకక ప్రతి రోజూ బర్రెలను మేతకు తీసుకుపోవడం, పాలు తీయడం(పితకడం) వంటి పనులతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏం చేయాలి అని ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది. అది చేపల పెంపకం. వెంటనే చేపలు పెంచుతున్న రైతుల దగ్గరకు వెళ్లి చేపల పెంపకం గురించి తెలుసుకున్న. ఒకేసారి పాండు(గుంత) తవ్వి చేప పిల్లలను వదిలితే సరిపోతుందని, ఒక్క కూలీతో దాణా వేయవచ్చని, ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల సమయంలో చేపలను పట్టి మార్కెట్కు తరలిస్తే సరిపోతుందని తెలిపారు. త్వరలో నేను కూడా చేపల పెంపకాన్ని ప్రారంభిస్తా. – చింతలగారి కృష్ణ, రైతు, కొల్చారం
ప్రభుత్వం ప్రోత్సహిస్తే లాభాలు..
చేపల పెంపకం కోసం రూ.5లక్షలు ఖర్చు చేసి సిమెంటుతో పాండు నిర్మించాం. పిట్టల నుంచి రక్షణ కోసం వల(జాలి) వేశాం. చేపల పెంపకానికి కూలీల అవసరం తక్కు వ, కానీ, పెట్టుబడి ఎక్కువ. చేపల పెంపకానికి మత్స్య కారులకు ఇచ్చిన విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుంది. చేపల పెంపకంతో ఎంతో మం దికి ఉపాధి లభిస్తుంది.
– యాదగిరి, రైతు, అప్పాజిపల్లి