ప్రకృతే అతని పరివారం.. మొక్కలే అతని బంధువులు.. పచ్చని చెట్లే అతని నేస్తాలు.. హరిత భారతమే అతని లక్ష్యం.. పర్యావరణ హితం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. మొక్కల పెంపకం కోసం దేశం మొత్తం పాదయాత్ర చేస్తానని చెబుతున్నాడంటే అతనికి పచ్చదనం మీద ఎంత మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవితం మొత్తం మొక్కల పెంపకానికే ధారపోసిన పర్యావరణ హితుడు అతడు. ఎవరి సహాయం లేకుండా ఒక్కడే 35 ఏండ్లలో రెండు లక్షలకు పైగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు. అతడే సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్గౌడ్. అవకాశం వస్తే దేశం మొత్తం పాదయాత్ర చేసి మొక్కల పెంపకంతో కలిగే ప్రయోజనాలను చెబుతానంటున్న శ్రీనివాస్గౌడ్పై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 29 : సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్గౌడ్ ఆరో తరగతిలో ఉన్నప్పుడు అతని టీచర్ ప్లాంట్ ఏ ట్రీ అనే ఇంగ్లిష్ పాఠం చెబుతూ చెట్టు విలువ, గొప్పతనాన్ని వివరించింది. ఆ పాఠం అతని మనసులో బలంగా నాటుకుపోయింది. దాని నుంచి పొందిన ప్రేరణ అతనిని 35 ఏండ్లు మొక్కలు నాటించేలా చేసింది. ఎంఏ, బీఈడీ చేసిన శ్రీనివాస్గౌడ్ 15 ఏండ్ల పాటు విద్యా వలంటీర్గా, మరికొన్ని సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే తను చదువు చెప్పిన పాఠశాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం కిలోమీటర్ దూరం నుంచి చేతిపంపుల సహాయంతో మండుటెండలో నీళ్లు తెచ్చి వాటిని కాపాడేవాడు. ఎంతమంది హేళన చేసినా అతను పట్టించుకోలేదు. రెండుసార్లు ఎండకు అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా మొక్కల పెంపకంపై తనకున్న ధ్యాసను మాత్రం వదల్లేదు. ‘ఇంటికో వేప.. ఊరికో జమ్మి..’ అనే నినాదంతో ‘భారతి ప్రకృతి పరిరక్షణ సంస్థ’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడటమే తన ధ్యేయమని శ్రీనివాస్గౌడ్ చెబుతున్నాడు.
నాలుగు విడతలుగా.. వనయజ్ఞ మహా పాదయాత్ర..
చెట్ల ఆవశ్యకతను తెలియజేసేందుకు శ్రీనివాస్గౌడ్ నాలుగు విడతలుగా వనయజ్ఞ మహా పాదయాత్ర చేశాడు. మొదట సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలో ఆయుత చండీయాగం నిర్వహించిన సమయంలో సిద్దిపేటలో వేల సంఖ్యలో మొక్కలు నాటుతూ వనమహా యజ్ఞ పాదయాత్ర చేశాడు. సిద్దిపేట పట్టణంలోని శరభేశ్వర ఆలయం నుంచి ముస్తాబాద్ వరకు రెండోసారి పాదయాత్ర చేసి మొక్కలు నాటడంతో పాటు ప్రజలు, విద్యార్థులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాడు. మూడోసారి సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని సిద్దిపేట శివారులోని దాసాంజనేయ ఆలయం నుంచి రాజీవ్ రహదారికి ఇరువైపులా జమ్మి, మారేడు మొక్కలు నాటుతూ 41 రోజుల పాటు హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి లక్ష మొక్కలు నాటించాడు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులతో మొక్కలు నాటించాడు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగంగా నాలుగో సారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో సిద్దిపేట నుంచి గజ్వేల్ వరకు మొక్కలు నాటించాడు. హైదరాబాద్లోని నిజాం కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ, సికింద్రాబాద్ పీజీ కళాశాలతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో శ్రీనివాస్గౌడ్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాడు. అనంతరం మూడేండ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలు తిరిగి వేల సంఖ్యలో మొక్కలు నాటి ప్రజలకు అవగాహన కల్పించాడు. నీటి కరువు ఉన్న ప్రాంతాల్లో సైకిల్ పై స్వయంగా బిందెలతో నీళ్లు తీసుకొచ్చి మొక్కలకు జీవం పోసి రక్షిస్త్తుంటాడు.
ఎన్నో రికార్డులు.. మరెన్నో ప్రశంసా పత్రాలు
పర్యావరణంపై తనకున్న అభిమానంతో లక్షకు పైగా మొక్కలు నాటినందుకు 2017లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ రికార్డుల పుస్తకంలో శ్రీనివాస్గౌడ్కు చోటు లభించింది. వరల్డ్ అమేజింగ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఇండియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2018లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో చోటు దక్కింది. 2017, 2018లో రెండుసార్లు వరుసగా సావిత్రీబాయి పూలే పురస్కారం, ఉగాది పురస్కారానికి ఎంపిక కావడంతో పాటు 20కి పైగా ప్రశంసా పత్రాలు, అవార్డులు పొందడం విశేషం. ఇన్ని రికార్డులు, అవార్డులు సాధించినా సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట గల ఫుట్పాత్ పైన జీవనం కొనసాగిస్తూ ఓ నర్సరీని ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాడు. దాదాపు 33ఏండ్లు ఉచితంగా సమాజ సేవ చేశాడు. ఆర్థిక భారంతో రెండేండ్ల నుంచి ఉపాధి కోసం నర్సరీ ఏర్పాటు చేసుకున్నా, అందులో వచ్చిన మొత్తాన్ని సైతం మొక్కలు పెంపకానికే ఖర్చు చేస్తున్నాడు.
అడవులు సృష్టించడమే ధ్యేయం..
వృక్షాలే జాతి సంపద. అడవులు సృష్టించడమే ధ్యేయం. అవకాశం వస్తే తెలంగాణ మొత్తం మరోసారి పాదయాత్ర చేసి హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తా. భవిష్యత్లో ప్రభుత్వం, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ సహకరిస్తే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి కోసం ప్రచారం చేస్తా. పర్యావరణం, మొక్కల పెంపకంపై దేశ ప్రజలకు వివరిస్తా. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటుతూ దేశమంతా పాదయాత్ర చేయడానికి కావాల్సిన వనరుల కోసం ఎదురు చూస్తున్నా.
– కోటగిరి శ్రీనివాస్గౌడ్, వృక్ష ప్రేమికుడు, భారతి పరిరక్షణ సంస్థ వ్యవస్థాపకుడు