తక్కువ ఖర్చుతో ఎక్కువ పశుగ్రాసం
నిజాంపేట, జూన్ 4: నాటు వేసినప్పటి నుంచి కోత దశకు చేరుకునే వరకు వివిధ స్థాయిల్లో యంత్రాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఇది వరకు వరికోతను కూలీలను పెట్టి నూర్పిళ్లు చేయడంతో పశుగ్రాసనికి కొరత ఉండేది కాదు. మారుతున్న కాలంలో రైతులకు కూలీలు దొరకకపోవడంతో యంత్రాలపై ఆదారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వరికోతను హార్వేస్టర్ ద్వారా కోయిస్తున్నారు. గడ్డి చెల్లాచేదురుగా పడటం తో సేకరించడానికి ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలకు గడ్డిని సేకరించే యంత్రం అందుబాటులోకి వచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ గ్రాసాన్ని సేకరించడంతో పాటు కూలీల ఖర్చు సైతం ఆదా అవుతున్నది.
యంత్రంతో తక్కువ ఖర్చు
కూలీలతో గడ్డిని పంజాలుగా కట్టి ఆ తర్వాత వేరే చోటుకు తీసుకెళ్లి గడ్డివాముగా పెట్టుకోవడం తరతరాలుగా వస్తున్న పశుగ్రాస సేకరణ విధానం. కాని ప్రస్తు త పరిస్థితుల్లో కూలీల సమస్య వెంటాడుతున్నది. రైతులకు సాయంగా గడ్డి చుట్టే యంత్రం అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా పశుగ్రాసాన్ని సేకరిస్తున్నది. దాదాపుగా ఒక రోజులో ఈ యంత్రం సహాయంతో 10ఎకరాల్లో గడ్డిని కట్టలుగా చుట్టవచ్చు. పాడి రైతులకు ఈ యంత్రం వరంలాంటిది. పశుగ్రాసం లేక పశువులను తక్కువ ధరకు అమ్ముతున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రంతో పశుగ్రాసం ఎక్కువగా సేకరణ జరిగి పశుసంపద పెంచుకుంటున్నారు.
రవాణా సులభం
యంత్రంతో చుట్టబడిన గడ్డి కట్టలు నిల్వ చేయడం ఎంతో సులువు. ఒక వేళ వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కట్టలు చుట్టలుగా చుడితే ఒక చోటు నుంచి మరొక చోటుకు సులువుగా తరలించవచ్చు. దీంతో సమయంతో పాటు డబ్బు ఆదా అవుతున్నది.
యంత్రంతో కూలీల ఖర్చు తగ్గింది
గడ్డి కట్టలను కట్టాలని కూలీలను పిలిచినా రామంటూ బదులిస్తున్నారు. కాలం నెత్తిమీదికి వచ్చింది. ఎప్పుడు వర్షం పడ్డా గడ్డి అంతా తడిసి మురిగిపోతుం ది. పశువులకు గడ్డి ఉండదు. గ్రామానికి చెందిన ఓ రైతు గడ్డి కట్టలు చుట్టే యంత్రం తెచ్చారు. ఆ యంత్రంతో కట్టలను చుట్టించాను. ఒక్కో కట్టకు రూ. 35చొప్పున చెల్లిం చాను. కూలీల అవసరం లేకుండానే యంత్రం చుట్టిన కట్టలను వాముగా పెట్టిన.
–మ్యాకల చంద్రయ్య, రైతు
గడ్డి చుట్టే యంత్రం రైతులకు వరం
కోతకు వచ్చిన వరి పంటను హార్వేస్టర్తో కోసిన తరువాత పశుగ్రాస సేకరణ ఇబ్బంది ఉండేది. కూలీల సమ స్య, సమయం, డబ్బుల సమస్యలు రైతులకు భారంగా నిలిచేవి. ఈ యంత్రం ద్వారా చుట్టిన గడ్డి కట్టలు తరలించడం చాలా సులవు. వీటి తయారీకి సమయంతో పాటు ఖర్చు చాలా తక్కువ. అందుకే ఈ యంత్రం రైతులకు వరంగా మారింది.
– సతీశ్, మండల వ్యవసాయాధికారి, నిజాంపేట