హుస్నాబాద్, డిసెంబర్ 27: మున్సిపాలిటీతో పాటు పట్టణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హుస్నాబాద్లోని డిపో కాలనీ, కోమటి రాజవీరు కాలనీల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కూలీలకు 300ల రోజుల పాటు ఉపాధి కూలీ పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు పరిమితం చేయడంతో హుస్నాబాద్ లాంటి పట్టణాల్లోని పేద కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లోనూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని గద్దెనెక్కిన పాలకులకు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సొంత జాగా ఉన్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.
సమైక్య ప్రభుత్వంలో మూడు విడతలుగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో చివరి విడతలో ఇల్లు మొదలు పెట్టుకున్న లబ్ధిదారులు పూర్తి చేసుకోలేక పోయారని, వీరికీ ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున ఇవ్వాలన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, ఆదరి మల్లేశ్, నాయకులు సంజీవరెడ్డి, సుదర్శనాచారి, గూడ పద్మ, రాజ్కుమార్, మల్లారెడ్డి, స్వాతి, నిర్మల, శోభ, సంధ్య, కోమల, లక్ష్మి, భాస్కరాచారి, నాగరాజు పాల్గొన్నారు.