సంగారెడ్డి జూన్ 5 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక పెట్టుబడులకు కేరాఫ్గా మారింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, టీఎస్ఐపాస్ కారణంగా సంగారెడ్డి జిల్లాలో తొమ్మిదేండ్లలో పెద్ద సంఖ్యలో మెగా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. టీఎస్ఐపాస్ తీసుకువచ్చి అతి స్వల్పకాలంలో ఏకపక్ష పద్ధ్దతిలో (సింగిల్ విండో) పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం ప్రారంభించారు. టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు రాకపోతే 16న పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది. ఫలితంగా తొమ్మిదేండ్లలో సంగారెడ్డి జిల్లాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తరలివచ్చాయి. పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో మొత్తం 2572 పరిశ్రమలు రూ.28, 161 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యాయి. 1,88,191 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రతిఏటా సుమారు రూ.3 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎగుమతులతో పోలిస్తే సంగారెడ్డి జిల్లా వాటా 19.53 శాతం ఉన్నది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు జిల్లాలోని అనేక పరిశ్రమలను ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ విజన్.. త్వరలో ఫార్మా సిటీ
సీఎం కేసీఆర్ విజన్, ప్రభుత్వ విధానాల ఫలితంగా జిల్లాకు పెట్టుబడులు తరలివస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో 14వేల ఎకరాల్లో రూ.64వేల కోట్ల పెట్టుబడులతో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. సుల్తాన్పూర్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సుమారు 4.20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మునిపల్లి మండలంలోని లింగంపల్లిలో 487 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పటాన్చెరు నియోజకవర్గంలో ఐటీ టవర్ను నిర్మించే ఆలోచనలో ఉంది. ఐటీ టవర్ ఏర్పాటైతే సంగారెడ్డి జిల్లాలోఐటీ రంగ పరిశ్రమలు తరలివస్తాయి.
నిమ్జ్తో జహీరాబాద్కు పెట్టుబడుల వరద
జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ఏర్పాటు అయ్యింది. నిమ్జ్కు నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నది. 12,635 ఎకరాల్లో నిమ్జ్ ఏర్పాటు అవుతుంది. నిమ్జ్ ప్రాజెక్టు వ్యయం రూ. 13,300 కోట్లు కాగా, 60 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గతేడాది నిమ్జ్లో వెమ్టెక్నాలజీ తొలి పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. వెమ్ టెక్నాలజీ రూ.1000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నది. ట్రైటాన్ కంపెనీ రూ.2100 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్త్తున్నది. నిమ్జ్లో డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
తొమ్మిదేండ్ల్లలో రూ.28,181 కోట్ల పెట్టుబడులు
ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో 4306 పరిశ్రమలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొమ్మిదేండ్లలో జిల్లాలో 2572 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో 88 మెగా పరిశ్రమలు రూ.13,305 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. రూ.6323 కోట్లతో 157 భారీ పరిశ్రమలు, రూ.3938 కోట్లతో 177 మధ్య తరహా పరిశ్రమలు వచ్చాయి. రూ.4065 కోట్లతో 1085 చిన్న పరిశ్రమలు, రూ.548 కోట్లతో 1065 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమల ద్వారా 1,88,191 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పరోక్షంగా వందలాది మంది యువతకు ఉపాధి లభించింది. జహీరాబాద్లోని మహీంద్రా సంస్థ రూ.1000 కోట్లతో ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమ రూ.1000 కోట్లతో కంపెనీ విస్తరణ చేపట్టింది. ఫార్మా రంగానికి సంబంధించి కోవలెంట్ ఫార్మా లేబొరేటరీస్ రూ.708 కోట్లు, పిరమిల్ ఫార్మా కంపెనీ రూ.468 కోట్లు, అరబిందో ఫార్మా రూ.641 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. కార్వీ సోలార్ పవర్ సంస్థ రూ.151 కోట్లు, అక్షయ్ ఉర్జూ కంపెనీ రూ.169 కోట్లు, ఓమిక్స్ కంపెనీ రూ.128 కోట్లు పెట్టుబడులు పెట్టాయి.
‘కంటి వెలుగు’ కండ్లద్దాల తయారీ సంగారెడ్డి జిల్లాలోనే..
రాష్ట్ర ప్రభుత్వం కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేసేందుకు ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుండగా, 1.50 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కండ్లద్దాలను పంపిణీ చేస్తున్నారు. కంటివెలుగులో అందజేస్తున్న కండ్లద్దాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజ్ పార్కులో తయారు అవుతున్నాయి. మెడికల్ డివైజ్ పార్కులోని ఆకృతి ఆఫ్తామాలిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని గతేడాది రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కంటివెలుగులో అందజేసే రీడింగ్, ప్రిస్కిప్షన్ అద్దాలను ఆకృతి పరిశ్రమలో తయారు అవుతున్నాయి. ఆకృతి సంస్థ మొత్తం 35 లక్షల కండ్లద్దాలను కంటివెలుగు కోసం ఉత్పత్తి చేస్తోంది. గతంలో కంటివెలుగు అద్దాలను ఇతర ప్రాంతాల్లో తయారు చేసిన తీసుకువచ్చి తెలంగాణలో పంపిణీ చేశారు. కాగా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని ఆకృతి కంపెనీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అద్దాలను కంటివెలుగులో అందజేస్తున్నారు.
సుల్తాన్పూర్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు
జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి జహీరాబాద్లోని నిమ్జ్, పటాన్చెరులోని మెడికల్ డివైజ్ పార్కులు కారణంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పటాన్చెరు మండలం సుల్తాన్పూర్లో 250 ఎకరాల్లో రూ.1424 కోట్లతో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేసింది. ఇక్కడ 50 పరిశ్రమలు రానున్నాయి. 7వేల మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది. ఇప్పటికే 26 పరిశ్రమల వరకు ప్రారంభమయ్యాయి. గతేడాది మంత్రి కేటీఆర్ రూ.265 కోట్లతో ఏర్పాటైన ఏడు పరిశ్రమలను ప్రారంభించారు. రూ.530 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన సహజానంద మెడికల్ టెక్నాలజీస్ సంస్థను ప్రారంభించారు. మెడికల్ డివైజ్పార్కుకు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఫిక్కీ ఫ్లో పార్కును 50 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. ఇందులో 26 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. జిన్నారం మండలం శివానగర్లో ప్రభుత్వం 120 ఎకరాల్లో ఎల్ఈడీ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఎల్ఈడీ పార్కులో వంద పరిశ్రమలు రానున్నాయి.