పల్లెలో మరింత మెరుగైన పాలన అందించేందుకు పంచాయతీలకు శాశ్వత, పక్కా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బిల్డింగులు పాతబడగా, మరికొన్ని నేడో,రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. సొంత భవనాలు లేని చోట్ల ప్రైవేటు ఇండ్లు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర, తాతాలిక భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఈ సమస్యలంటినీ పరిష్కరించేందుకు నూతన నిర్మాణాలు చేపట్టాలని సర్కారు భావిస్తున్నది. అందులో భాగంగా మెదక్ జిల్లాలో 97 భవనాలు నిర్మించేందుకు రూ.19.40కోట్లు కేటాయించింది. అలాగే, కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లోనూ కార్యాలయాలు నిర్మించనుండడంతో స్థల సేకరణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక్కో భవనాన్ని రూ.20లక్షలు వెచ్చించనుండగా, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక గదులు, సమావేశాల కోసం పెద్దహాల్, అత్యాధునిక వసతులు, హైటెక్ హంగులతో అన్ని వసతులు కల్పించనున్నారు.
మెదక్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో 97 పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు కేటాయిస్తారు. ఒకో పంచాయతీకి రూ.20 లక్షలు వెచ్చించి భవనాన్ని నిర్మిస్తారు. ఇప్పటికే పాత భవనాలున్న చోట్ల శిథిలమైన వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం, కొత్త పంచాయతీల్లో కార్యాలయ నిర్మాణానికి స్థల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాతాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. శిథిలమైన పాత పంచాయతీలకూ ఇప్పుడు నూతన భవనాలు నిర్మిస్తారు.
ఒకో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20లక్షలు..
మెదక్ జిల్లాలో 97 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించేందుకు రూ.19.40 కోట్లు కేటాయించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. జిల్లాలో 21 మండలాల పరిధిలో 469 గ్రామ పంచాయతీలున్నాయి. 2018 కంటే ముందు జిల్లాలో 320 గ్రామ పంచాయతీలుండేవి. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ నూతన గ్రామ పంచాలయతీలను ఏర్పాటు చేయడంతో జిల్లాలో అదనంగా 149 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొన్ని పంచాయతీల్లో కార్యాలయాలు అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర, తాతాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి.
తాతాలిక, ప్రైవేట్ పంచాయతీ భవనాల్లో అవసరమైన సదుపాయాలు లేక సమావేశాల నిర్వహణ సైతం ఇబ్బందిగా మారింది. గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు లేని గ్రామాల్లో పాలకవర్గాలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సొంత భవనాలను మంజూరు చేసింది. ప్రతీ గ్రామ పంచాయతీకి శాశ్వత భవనం ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ పథకం కింద మెదక్ జిల్లాకు 97 కొత్త పంచాయతీ భవనాలు మంజూరు చేసింది. గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం చేపడితే గ్రామ పాలన మరింత బలోపేతం కానున్నది. ప్రతీ పంచాయతీ భవనంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక గదులు, సమావేశాల నిర్వహణకు వీలుగా హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. అన్ని హంగులతో అవసరమైన సదుపాయాలు కల్పించనున్నారు.
జిల్లాలో మండలాల వారీగా..
జిల్లాలో అత్యధికంగా శివ్వంపేట మండలానికి 10 పంచాయతీ భవనాలు మంజూరు కాగా, అత్యల్పంగా నార్సింగి మండలానికి 1 పంచాయతీ భవనం మంజూరు చేశారు. నర్సాపూర్ మండలానికి 9 పంచాయతీ భవనాలు, కౌడిపల్లికి 8, చిన్నశంకరంపేటకు 8, కొల్చారం మండలానికి 7, హవేళీఘనపూర్కు 7, టేక్మాల్కు 7, మెదక్కు 5, రామాయంపేటకు 5, నిజాంపేటకు 5, వెల్దుర్తికి 5, చిలిపిచెడ్కు 6, మాసాయిపేటకు 2, పెద్దశంకరంపేటకు 3, పాపన్నపేటకు 2, అల్లాదుర్గంకి 2, రేగోడ్కు 3, చేగుంట మండలానికి 2 చొప్పున ఆయా మండలాలకు పంచాయతీ భవనాలు మంజూరు చేశారు.
జిల్లాలో 97 పంచాయతీలకు పక్కా భవనాలు
మెదక్ జిల్లాకు 97 పంచాయతీలకు నూతన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద నూతన పంచాయతీ భవనాలను నిర్మించనున్నారు. ప్రస్తుతం కొత్త గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో పరిపాలనా ఇబ్బందిగా ఉండడంతో ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలు నిర్మించడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
– హరీశ్, మెదక్ కలెక్టర్