HomeMedakGovernment Schools Are Changing With Manauru Manabadi
మనఊరు-మనబడి’తో మారుతున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు
ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి మార్చి 8, 2022లో శ్రీకారం చుట్టింది.
తొలి విడతలో 313 ఎంపిక
258 బడుల్లో కొనసాగుతున్న పనులు
రూ.7 కోట్ల79లక్షల బిల్లులు చెల్లింపు
మెదక్ జిల్లాలో మొత్తం పాఠశాలలు: 898
33 పాఠశాలల్లో పనులు పూర్తి
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 30: ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయి. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి మార్చి 8, 2022లో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో మూడు విడతలకుగాను రూ.150 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 21 మండలాల పరిధిలో 898 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో ప్రాథమిక పాఠశాలలు 128, ప్రాథమికోన్నత పాఠశాలలు 624, ఉన్నత పాఠశాలలు 146 ఉన్నాయి. తొలి విడతలో 313 పాఠశాలలను ఎంపిక చేయగా, ఇప్పటి వరకు 33 పాఠశాలల్లో పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 258 పాఠశాలల్లో 50 శాతానికి పైగా పనులు పూర్తి కాగా.. తుది దశ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనులకు రూ.7 కోట్ల 79 లక్షల బిల్లులు చెల్లించింది.
258 పాఠశాలల్లో కొనసాగుతున్న పనులు..
మొదటి విడతలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలను పరిగణనలోకి తీసుకున్నారు. ఎంపిక చేసిన 313 పాఠశాలల్లో ప్రాథమిక 44, ప్రాధమికోన్నత 180, ఉన్నత పాఠశాలలు 89 ఉన్నాయి. వీటిలో 33 పాఠశాలల్లో పనులు పూర్తికాగా 258 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి సదుపాయాల వివరాలు సేకరించిన తరువాతనే అధికారులు పనులు ప్రారంభించారు. మౌలిక సదుపాయాల పనులను సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.
అన్నిరకాల సదుపాయాలు
ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీటి వసతి, విద్యుత్తు సౌకర్యం, మరుగుదొడ్లు, అవసరమైన ఫర్నిచర్, పెయింటింగ్, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీలు, కిచెన్, అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్, డిజిటల్ విద్య పనులు చేపడుతున్నారు.
త్వరలో పనులు పూర్తి చేస్తాం
మన ఊరు-మనబడిలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న పనులు త్వరలో పూర్తి చేస్తాం. తొలి విడతలో 313 పాఠశాలలు ఎంపిక కాగా, ఇప్పటి వరకు 33 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. 258 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తైనా వాటితో పాటు 50 శాతానికి పైగా పనులు పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించాం. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది.