పాపన్నపేట, డిసెంబర్ 9 : ప్రతి గ్రామంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజాప్రతిధులపై ఉందని ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి, తహసీల్దార్ మహేందర్ పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల మంజూరులో లబ్ధిదారులను రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, మున్ముందు ప్రజల నుంచి ఫిర్యా దులు రాకుండా పని చేయాలని సూచించారు. పాపన్నపేటలో మండ ల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రజా సమస్యలను ప్రస్తావించారు.
ఈ సంద ర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన తహసీల్దార్ సైతం భూసమస్యల విషయంలో ఆర్జిదారులను ఇబ్బందులు గురి చేశారని, ఇకపై అలా జరగకుండా చూడాలని సూచించారు. విద్యుత్శాఖ అధికారులకు సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని డాక్యాతండా సర్పంచ్ హీరాలాల్, ఎంకేపల్లి సర్పంచ్ మల్లేశం ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీల తరపున ప్రతినెలా బిల్లులు చెల్లిస్తున్న కొత్తగా కరెంట్ స్తంభాలు వేయడం లేదని ఆరేపల్లి సర్పంచ్ శ్రీనాథ్రావు పేర్కొన్నారు.
గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమ స్య లను తక్షణమే పరిష్కరించాలని ఏఈని ఎంపీపీ ఆదేశించారు. నీటిపారుదలశాఖ చేపట్టిన పనులను ఏఈ విజయ్ వివరించారు. మండలంలో 25 మిషన్ కాకతీయ పనులు పెండింగ్లో ఉన్నాయని, సర్పంచ్లు స్పందించి పనులను చేపట్టాలని సూచించారు. వనదుర్గా ప్రాజెక్టులో షటర్ల పనులు కొనసాగుతున్నాయని, 15రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.
పంచాయతీరాజ్శాఖతోపాటు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు బిల్లులు రావడం లేదని సర్పంచ్ లు ఫిర్యాదు చేశారు. శ్రీనిధి రుణాల మంజూరులో మహిళల నుంచి సీఏలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్త్రీ, శిశుసంక్షేమశాఖకు సంబంధించి మూడు సెక్టార్లకు సూపర్వైజర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మల్లేశం, కోఆప్షన్ సభ్యుడు గౌస్పాషా, సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.