చేర్యాల, సెప్టెంబర్ 23 : డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించే సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయ (ఐవోసీ) పనులు చేర్యాలలో కొనసాగుతున్నాయి.పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సమీకృత కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. చేర్యాల పట్టణంలో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే యోచనలో ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా రూ.17కోట్లు మంజూరు చేయగా మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పనులను ప్రారంభించారు.
సమీకృత భవనంతో ప్రజలకు ఎంతో మేలు
ప్రభుత్వంలోని ప్రతిశాఖకు చెందిన కార్యాలయాలు ఇక సమీకృత భవనంలోకి రానున్నాయి. దీంతో ప్రజలకు ఎంతో మేలు జరుగనున్నది. ఒక్కో కార్యాలయం ఒక్కో ప్రదేశంలో ఉండడంతో ప్రజలు ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు.నిర్మాణ పనులు పూర్తయితే ప్రజలకు ఇక్కట్లు తప్పనున్నాయి. తాలుకాగా చేర్యాల కొనసాగిన సమయంలో నిర్మించిన పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి.మరిన్ని కార్యాలయాలు ఇరుకుగా ఉండడం, మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నూతనంగా నిర్మించే భవనంలో ఓ వైపు ప్రజలకు, మరో వైపు అధికారులు, సిబ్బందికి వసతి కలుగనున్నది. ఆధునిక వసతులతో సాంకేతికను వినియోగించుకునే విధంగా నిర్మాణాలు చేపట్టనుండడంతో పట్టణ,మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మాసాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎల్ ఆకారంలో నిర్మించే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్, మొదటి,రెండో అంతస్తులో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు పనులు పూర్తికాగా, మొదటి అంతస్తులో పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం
నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దశల వారీగా చేర్యాలకు అన్ని హంగులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. సమీకృత భవన నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగనున్నది. ఇటీవల చేర్యాలలో పలు డీఈఈ స్థాయి కార్యాలయాలు సైతం ప్రారంభించారు. సమీకృత భవన నిర్మాణంతో పట్టణ, మండల ప్రజల కష్టాలు తీరనున్నాయి. సమీకృత భవనం నిర్మాణం పూర్తయితే ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
మండల స్ధాయిలో సమీకృత భవన సముదాయం నిర్మించడం అభినందనీయం .రూ.17కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావుకు కృతజ్ఞతలు. నియోజకవర్గం గల్లంతు కావడంతో చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ చేర్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారు. చేర్యాలలో మున్సిపాలిటీ, నాలుగులైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, వెజ్నాన్వెజ్ భవనం, అంబేద్కర్ భవనం, ఆధునిక వసతులతో కొత్త దవాఖాన మంజూరు చేశారు. ఇటీవల కోర్టును సైతం మంజూరు చేసి చేర్యాల ప్రాంతంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రేమను చాటుకున్నారు.
– ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే