నారాయణఖేడ్, ఏప్రిల్ 30: జొన్న పంట చేతికొచ్చి పక్షం రోజులైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో యాసంగిలో ప్రధాన పంటగా జొన్న సాగుచేశారు. కొనుగోలుకు ప్రభు త్వం ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం జొన్న పంట చేతికి వచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు పండించిన జొన్నలను కేంద్రాల్లో విక్రయించడం ద్వారా మద్దతు ధర లభించేది.
అయితే ఈ సారి జొన్నలు పొలాల నుంచి ఇంటికి చేరి పదిహేను రోజులైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నారాయణఖేడ్ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడం తదితర కారణాల వల్ల ఇక్కడి రైతులకు జొన్న సంప్రదాయ పంటగా మారింది. ఈ ప్రాంతంలో భూగర్భజలాల కొరత అధిక ఉండడం వేసవిలో బోరు, బావుల్లో నీరు అడుగంటే పరిస్థితి దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా జొన్న పంట సాగు చేస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో జొన్న పంట సాగు చేసే అవకాశం ఉండడంతో పాటు ఆరుతడి పంట విధానంలో అధిక దిగుబడి సాధించవచ్చు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 50,206 ఎకరాల్లో జొన్న పంట సాగుచేశారు. కంగ్టి మండలంలో 15,439 ఎకరాలు, సిర్గాపూర్ మండలంలో 9,121 ఎకరాలు, కల్హేర్ మండలంలో 7,698 ఎకరాలు, మనూరు మండలంలో 4,304 ఎకరాలు, నాగల్గిద్ద మండలంలో 3,825 ఎకరాలు, నిజాంపేట్ మండలంలో 3,089 ఎకరాల్లో జొన్నపంట సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అడ్డికి పావుశేరు లెక్కన జొన్నలు కొనుగోలు చేసేందుకు దళారులు తిష్టవేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో చేస్తున్న జాప్యం జొన్నరైతులను ఆవేదనకు గురి చేస్తోంది. క్వింటాల్ జొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర రూ.3,699 ఉండగా దళారులు ధాన్యం నాణ్యతను బట్టి రూ.2,500 నుంచి రూ.2,800లకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తక్కువ ధరకు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం నాణ్యతలో లోపాలు చూపుతూ తరుగు తీసే పద్ధతి ఇంకా గ్రామాల్లో కొనసాగుతున్నది. ఓవైపు తక్కువ ధర మరోవైపు తరుగు వల్ల నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. జొన్న రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సత్వరమే నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని జొన్నరైతులు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జొన్న సాగుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఊతమిచ్చింది. 2016లో అప్పటి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అభ్యర్థన మేరకు అప్పటి మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో నియోజకవర్గంలో తొలిసారి జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతిఏటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించడంతో సహజంగానే రైతులు జొన్న పంట సాగువైపు మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలు పెరిగి ఆరుతడి పంట అయిన జొన్న నిరాటంకంగా సాగవుతున్నది. 24 గంటల కరెంట్ కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జొన్న పంట సాగుకు ఉపకరించిందని చెప్పక తప్పదు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో యాసంగిలో సీజన్లో ప్రధాన పంటగా జొన్నసాగు చేస్తారు. జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్నలను కొనుగోలు చేసింది. ఈసారి పంట చేతికొచ్చి పదిహేను రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ఆందోళన చెందుతున్నాం. అసలు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందో లేదో కూడా తెలియడం లేదు.
– నాగేందర్ పాటిల్, సంగెం, సిర్గాపూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)