రూ.కోటితో అధునాతన సౌకర్యాలు
చేర్యాల, డిసెంబర్ 15: చేర్యాల పట్టణంలో దశబ్దాల క్రితం నిర్మించిన ఆర్టీసీ బస్స్టేషన్కు తెలంగాణ సర్కారు పాలనలో మహర్దశ పట్టింది. గతంలో కేవలం రెండు ప్లాట్ఫామ్స్కు పరిమితమైన బస్స్టేషన్లో ఇప్పుడు నాలుగు ప్లాట్ఫాంలు నిర్మించడంతో ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలిగింది. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేర్యాల
బస్స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం రూ.కోటిని ప్రభుత్వం మంజూరు చేసింది. చేర్యాల బస్ స్టేషన్ మీదుగా నిత్యం వందలాది ఆర్టీసీ బస్సులు హైదరాబాద్, హన్మకొండ, హుస్నాబాద్, నంగునూరు, సిద్దిపేట, జనగామ, యాదాద్రి జిల్లా రాజపేట, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, కొమురవెల్లి, బాసర తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటాయి. ఆయా ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలు నిత్యం ఇదే బస్స్టేషన్ వచ్చి బస్సులను ఆశ్రయించి వారివారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. దీంతో పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, జనగామ జిల్లా తరిగొప్పులు, బచ్చన్నపేట మండలంలోని
60 గ్రామాల విద్యార్థులు పట్టణంలోని డిగ్రీ, ఇంటర్, ఐటీఐ తదితర విద్యలను అభ్యసించేందుకు గ్రామాల మీదుగా నడిచే బస్సులను ద్వారా చేర్యాల బస్స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి కళాశాలలకు వెళ్తారు. సాయంత్రం కళాశాలల తరగతులు పూర్తయిన అనంతరం బస్స్టేషన్కు చేరుకుని గంటల పాటు వేచి ఉండి బస్సులు వచ్చిన అనంతరం తిరిగి వారి గ్రామాలకు వెళ్లిపోతారు.
ఆర్టీసీ బస్స్టేషన్ ఆధునీకరించి వసతులు చేకూర్చడంతో వందలాది మంది ప్రయాణికులు, విద్యార్థులకు తిప్పలు తప్పాయి. గతంలో వారికి ఆర్టీసీ బస్సు స్టేషన్లో ఎలాంటి వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. దశాబ్దాల క్రితం నిర్మించిన సమయంలో ఏర్పాటు చేసిన తాగు నీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు, కూర్చోవడానికి ఏర్పాటు చేసిన నిర్మాణాలు తదితర వసతులు శిథిలమైపోవడం, వాటిని తిరిగి మరమ్మతులు చేయకపోవడంతో అసలు బస్ స్టేషన్లో ఎలాంటి వసతులు లేకుండాపోయాయి. కూర్చోవడానికి నిర్మించిన అరుగులు కృంగిపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు గంటల పాటు బస్సుల వచ్చే వరకు నిలబడి ఉంటున్నారు. రూ.1కోటితో ఆర్టీసీ బస్స్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో ఉన్న రెండు ప్లాట్ఫామ్స్ను పెంచడంతో పాటు టాయిలెట్స్ నిర్మాణాలు, బస్టాండ్ ప్రదేశం చుట్టూ ప్రహారీగోడ, బస్స్టేషన్లో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు.