సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 2 : సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, సీపీ శ్వేతతో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు సూచించిన విధంగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలన్నారు.
పనులు జరిగే ప్రదేశంలో ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ శ్వేతకు సూచించారు. పనుల్లో వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మాట్లాడుతూ అదనపు టీఎంసీకి సంబంధించి నిర్వాసితులకు అందాల్సిన నష్ట పరిహారం గురించి ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా వీలైనంత త్వరగా అందించేలా మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.