సిద్దిపేట, మార్చి 2: సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలుపెట్టారని, ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తండా ప్రాంత వాసులైన గిరిజన నిర్వాసితులకు అందాల్సిన 21 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా వీలైనంత త్వరగా అందించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్, అదనపు కలెక్టర్కు సూచించారు.