జహీరాబాద్, జనవరి 5: మరిగమ్మ మోతిమాత జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత జాతర ఘనంగా ప్రారంభమైంది. పూజారులు, గిరిజన పెద్దలు హాజరై మెతిమాతకు పూజలు చేసి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. దేవాలయం ఎదుట యజ్ఞ హోమంలో పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.
కొండకోనళ్లో ఉంటూ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి ఒడిలో జీవనాన్ని కొనసాగించే గిరిజన పుత్రులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భారీగా గిరిజనులు తరలి రావడంతో అడవి బిడ్డలతో ప్రకృతి పులకించింది. గిరిజనుల ఆరాధ్య దైవం మరిగమ్మ మోతిమాత దేవస్థానం నిర్వాహకులు, ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు కల్పించడంతో పాటు తాగునీటి సదుపాయం, రోడ్లు, వైద్య శిబిరం ఏర్పాటు చేశాయి. పిల్లలు లేని దంపతులు ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే పిల్లలు పుడతారని గిరిజన పెద్దలు చెబుతారు. దీంతో, కొత్తగా పళ్లైన వధూవరులు మోతిమాతను దర్శించుకుని పూజలు చేసి ముడుపులు కడుతున్నారు. కోరికలు నెరవేరాలని దేవాలయ ఆవరణలో ఉన్న చెట్టుకు కొబ్బరికాయలు కట్టారు. యజ్ఞ హోమాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు.
నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు రాక
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మోతిమాత జాతర ఉత్సవాలకు హాజరవుతున్నారు. మంత్రితో పాటు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజూశ్రీ, కలెక్టర్ శరత్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. మంత్రి జాతరకు వస్తుండడంతో అధికారులు భారీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.